చిన్నకోడూరు, మే 23 : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్లో పున్నం మల్లయ్యకు చెందిన గొర్రెల మందపై అడవి జంతువులు దాడిచేయగా 70 గొర్రెలు మృతిచెందాయి. బాధితుడి వివరాల ప్రకారం.. పున్నం మల్లయ్య రోజు మాదిరిగా తన వ్యవసాయబావి వద్ద గల షెడ్డులో గొర్రెలు ఉంచి ఇంటికి వెళ్లాడు. రాత్రి ఒంటిగంట సమయంలో వర్షానికి వడ్లు తడుస్తాయని భావించి వ్యవసాయబావి వద్దకు వచ్చి ధాన్యంపై టార్పాలిన్లు కప్పాడు. అప్పుడు గొర్రెల షెడ్డులో ఎలాంటి సంఘటన జరగలేదు. తెల్లవారుజామున 4గంటలకు షెడ్డు వద్దకు వెళ్లగా 70 గొర్రెలు మృతిచెంది కనిపించాయి. మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించాయి. మొత్తం 120 గొర్రెలు ఉండగా.. కొన్ని గొర్రెలు భయంతో అక్కడి నుంచి పారిపోయాయి. సుమారుగా రూ.7 లక్షల నష్టం తనకు వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు.
ఫారెస్ట్ రేంజ్ అధికారి ఇక్రముద్దీన్, సెక్షన్ అధికారి బుచ్చయ్య సంఘటనా స్థలానికి చేరుకుని అడవి జంతువు పాద ముద్రలను గుర్తించారు. హైనా, తోడేళ్లు దాడిచేసి ఉండవచ్చని అంచనా వేశారు. రాత్రి పరిసర ప్రాంతాల్లో బోను, కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి ఘటానా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చి, మనోధైర్యం నింపారు. ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లి ఆర్థికసాయం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రైతులు ఆపదలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంత రం పోరాటం చేస్తుందని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాముని శ్రీనివాస్, ఎంపీటీసీ జమున ఎల్లయ్య, ఎఫ్పీవో చైర్మన్ వెంకట్రెడ్డి, పశు వైద్యురాలు మంజుల, మాజీ సర్పంచ్ గాజుల బాబు, నాయకులు రాజిరెడ్డి, రాజారెడ్డి ఉన్నారు.