అందోల్, జనవరి 20 : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించిన సంఘటన జోగిపేటలో కలకలం రేపింది. మృతుడు శుక్రవారం ఉదయం జోగిపేటలో కిడ్నాప్ కాగా శనివారం ఉదయం మెదక్ జిల్లాలో రామాయంపేట్లో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు చేపట్టి భార్యను, ఆమెకు సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ రమేశ్కుమార్ శనివారం జోగిపేట ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. జోగిపేటకు చెందిన పాపన్నపేట మల్లేశం (35) పట్టణంలో లాండ్రీ షాప్ నిర్వహిస్తున్నాడు. మండలంలోని మన్సాన్పల్లికి చెందిన కల్పనతో మల్లేశానికి 2015లో వివాహం జరిగింది. పెండ్లికి ముందే కల్పనకు అదే గ్రామానికి చెందిన మచ్కురి మహేశ్తో పరిచయమున్నది. పెండ్లి తర్వాత కూడా ఇద్దరు చనువుగా ఉండడంతో పలుమార్లు భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి.
దీంతో, ప్రియురాలి భర్త అడ్డు తొలిగించుకోవాలని ప్లాన్ వేసిన మచ్కురి మహేశ్ వరుసకు మేనమామ అయినా రంగంపేట్కు చెందిన ఉసికే అంబాజీకి విషయం చెప్పి సహాయం కోరాడు. అందుకోసం అదే గ్రామానికి చెందిన తలారి మహేశ్కు రూ. 50వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని, గంగారం గ్రామానికి చెందిన వజ్జెరి మహేశ్తో కలిసి హత్యకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ కారును అద్దెకు తీసుకుని ఉదయం 5:30 సమయంలో జోగిపేటలోని మల్లేశం ఇంటివద్ద కాపుకాసి అతడు బయటకు రాగానే దాడిచేసి కారులో తీసుకు వెళ్లారు. మార్గమధ్యలో అతడిని హత్యచేసి మెదక్ జిల్లా రామాయంపేట్ శివారులోని చెరువు వద్ద మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు జోగిపేటలో మల్లేశం కిడ్నాప్నకు గురైన స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పదంగా ఉండడంతో భార్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసినట్లు అంగీకరించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హత్యకు కారణమైన ప్రియుడు మచ్కురి మహేశ్, తలారి మహేశ్, వజ్జెరి మహేశ్, ఉసికే అంబాజీలను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించారు. విలేకరుల సమావేశంలో సీఐ నాగరాజు, ఎస్సైలు అరుణ్కుమార్గౌడ్, కోటేశ్వర్రావు, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.