సంగారెడ్డి, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మెదక్ పట్టణంలో డబ్బులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్పై ఎందుకు కేసు నమోదు చేయలేదని మాజీ మంత్రి హరీశ్రావు డీజీపీ శివధర్రెడ్డిని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఉన్న మెదక్ పట్టణానికి చెందిన 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను శనివారం ఆయన పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని త్వరలోనే బయటకు తీసుకువస్తామని ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించారు. అక్రమ కేసులు కొట్టివేసే వరకు న్యాయపోరాటం చేస్తామని, పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు. అనంతరం కంది జైలు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీయే ఎక్కువ కౌన్సిలర్ స్థానాలు గెలిచిందన్నారు.
మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ప్రజాస్వామ్య బద్ధంగా గెలుచుకోకుండా పోలీసు లాఠీ, అక్రమ కేసులతో గెలిచిందన్నారు. మెదక్లో గొడవ జరిగిన వార్డులోకి ఎమ్మెల్యే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే గన్మెన్ ముస్లిం మహిళను బెదిరించారన్నారు.అర్ధరాత్రి డబ్బులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే,అతడి అనుచరులు, ముస్లిం మహిళపై దాడి చేసిన గన్మెన్పై కేసు పెట్టలేదన్నారు. ఎమ్మెల్యే, అతడి అనుచరుల అన్యాయాలను ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి జైలులో నిర్బంధించడం ఏమిటని ప్రశ్నించారు. అరెస్టు అయిన బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆరుగురు ఎస్సీలు ఉంటే వారిపై కూడా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు.
మెదక్ పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేసినా పోలీసులు కేసులు పెట్టకపోవడంపై హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నాయకుల ఆటో, టిప్పర్ను కాంగ్రెస్ నాయకులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారన్నారు. వీటికి సంబంధించి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదన్నారు. మెదక్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ నాయకుడు గాయపర్చినా పోలీసులు కేసు పెట్టలేదన్నారు. దీనికి డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసిన, ఆస్తులు దగ్ధం చేసినవారిపై వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.
మెదక్ పట్టణంలోని కిందిస్థాయి పోలీసు అధికారులు చట్టానికి లోబడి పనిచేయకుండా అధికార పార్టీ నాయకులకు అండగా ఉంటూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అక్రమ కేసులతో జైలులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకుంటామని, వారికి న్యాయం దక్కే వరకు పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే హైకోరు, సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. మెదక్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ మీ వెన్నంటే ఉందని హరీశ్రావు భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, శశిధర్రెడ్డి ఉన్నారు.