హుస్నాబాద్, మార్చి 8: మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీకి పునరుజ్జీవం వచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రూ.2కోట్ల నిధులతో బస్టాండ్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఉచిత ప్రయాణంతో బస్సులు, బస్టాండ్లు కళకళలాడుతున్నాయని, ఇప్పటి వరకు 26కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కోసం ప్రభుత్వం నెలకు రూ.350కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తున్నదని చెప్పారు. గతంలో కేవలం 50 నుంచి 60 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేదని, ప్రస్తుతం 100 శాతం ఆక్యుపెన్సీ వస్తున్నదన్నారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు కొత్త బస్టాండ్ల నిర్మాణం చేపడుతామన్నారు. ఆర్టీసీలోని 50వేల మంది ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని, వీరి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని చెప్పారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా చీఫ్ సెక్రటరీ, ఆర్టీసీ ఎండీతో చర్చించి పాత బకాయిలను చెల్లించేందుకు జీవో తెస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినయ్యానని, ఈ ప్రాంత అభివృద్ధితో పాటు డిపోకు ఆదాయం పెంచేందుకు కొత్త రూట్లను త్వరలోనే కేటాయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ వినోద్కుమార్, ఆర్ఎం సుచరిత, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, సీఈ భూపతిరెడ్డి, డీఎం వెంకటేశ్వర్లు, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు, ఆర్టీసీ సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.