తెలంగాణ పథకాలు కర్ణాటకలో అమలు చేస్తాం
కొత్తూర్ (బీ)లోపర్యటించిన బీదర్ జిల్లా పంచాయతీ రాజ్ అధికారులు
పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీల పరిశీలన.. అధికారులకు ప్రశంసలు
జహీరాబాద్, ఫిబ్రవరి 8 : తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠ ధామాలు, రైతువేదికలు, ఉపాధిహామీ పనులు అద్భుతంగా ఉన్నాయని కర్ణాటక రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులు అన్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ అధికారులు మంగళవారం మండలంలోని కొత్తూర్(బీ) గ్రామంలో పల్లె ప్రగతి పనులను పరిశీలించి, అధికారులతో సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కర్ణాటకలో కూడా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. కొత్తూర్(బీ) గ్రామంలో నిర్వహిస్తున్న నర్సరీ, పల్లె ప్రకృతి వనంలో మొక్కల పెంపకం చాలా బాగుందన్నారు. పల్లెప్రకృతి వనంలో ఉదయం, సాయంత్రం నడిచేందుకు దారి వేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలు పెంచడంతో వాతావరణ కాలుష్యం జరుగకుండా స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. రైతువేదికలతో రైతులంతా ఒకే చోట సమావేశాలు నిర్వహించుకొనే అవకాశం కలుగుతుందన్నారు. గ్రామంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పంచాయతీ రాజ్ల పనితీరును కర్ణాటక అధికారులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీదర్ జిల్లా పరిషత్ డిప్యూటీ కార్యదర్శి సంజీవ్కుమార్, జడ్పీ అభివృద్ధి అధికారి వీరేందర్సింగ్, జహీరాబాద్ ఎంపీవో మహేశ్కుమార్, ఏపీవో అశోక్కుమార్, గ్రామ సర్పంచ్ జగన్మోహన్, పంచాయతీ కార్యదర్శి హనుమంత్, సాయన్నతో పాటు బీదర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.