ప్రతి రోజూ విధిగా ప్రాణాయామం, యోగా, వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్లో శనివారం రూ. 17.77కోట్లతో చేపట్టనున్న సీసీరోడ్లు, అంతర్గత డ్రైనేజీ పనులతో పాటు థీమ్ పార్కును ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్ పుష్పానగేశ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. బల్దియా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు థీమ్ పార్కును ఏర్పాటు చేశామని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. శ్రీసాయినగర్లో ఆలయ నిర్మాణానికి సంబంధించి వివాదం కోర్టులో ఉందని, ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించి ఆలయం నిర్మిస్తామన్నారు. కాకతీయనగర్లో స్పోర్ట్ కాంప్లెక్స్, మయూరినగర్లో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.
రామచంద్రాపురం, జనవరి7: ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ గంట వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం ఆర్సీపురం డివిజన్లో రూ.17.77 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్తో కలిసి మంత్రి ప్రారంభించారు.
మంత్రికి ఆర్సీపురం డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఆర్ఆర్నగర్, ఓల్డ్ ఆర్సీపురంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం ఆర్సీపురం షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా నుంచి వార్డు కార్యాలయం వరకు మంత్రి నడుచుకుంటూ వస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అక్కడి నుంచి సాయినగర్కాలనీ, మల్లికార్జుననగర్ కాలనీల్లో సీసీరోడ్లు, అంతర్గత డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అనంతరం శ్రీసాయినగర్కాలనీకి చేరుకుని థీమ్ పార్కును ప్రారంభించారు.
అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాజకీయంగా ఎన్నో పనులు చేస్తుంటాం, వాటిని ప్రజలు గుర్తుపెట్టుకుని వారి ప్రేమాభిమానాలు అందించినప్పుడు నిజంగా కడుపునిండినంత సంతోషం కలుగుందని అన్నారు. శ్రీసాయినగర్కాలనీ ప్రజలు తమపై చూపించిన ప్రేమ మరువలేనిదన్నారు. బల్దియా ఎన్నికల సమయంలో శ్రీసాయినగర్కాలనీ వాసులకు ఇచ్చిన మాట ప్రకారం థీమ్ పార్కు ఏర్పాటు చేయించామన్నారు.
థీమ్ పార్కు భూమి విషయంలో నాలుగైదు సార్లు అప్పటి కలెక్టర్ హనుమంతరావు వెంటపడి మాట్లాడి పార్కు ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పి ల్యాండ్ని జీహెచ్ఎంసీకి అలాట్మెంట్ చేయించి, నిధులు మంజూరు చేసి నిర్మించినట్లు చెప్పారు. థీమ్ పార్కు అద్భుతంగా అభివృద్ధి చేశారని, పార్కును చూస్తుంటే కొద్ది సేపైనా కూర్చోవాలనిపిస్తున్నదని అన్నారు. పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగల్గా మారి ఇంత గాలి పిల్చుకుందాం.. వాకింగ్ చేదాం.. పిల్లలతో సరదాగా గడుపుదామంటే అడుగు తీసి అడుగు పెట్టరాని పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి పార్కు ఉపయోగపడుతుందని అన్నారు.
ఆహారపు అలవాట్లు మారాలి
వాకింగ్, యోగా, ప్రాణాయామం ప్రతి మనిషి కూడా అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ముపై శాతం మందికి బీపీ, షుగర్ బీమారీ వస్తున్నదన్నారు. బీపీ, షుగర్ వచ్చిందంటే చెట్టుకు చెదలు పట్టినట్లు మనిషి శరీరానికి కూడా చెదలు పట్టినట్లేనని అన్నారు. దానిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే కంట్రోల్ చేయకపోతే లివర్, కిడ్నీ, గుండె ఎదో ఒకదానికి ఎఫెక్ట్ ఉంటుందన్నారు. మన ఆహారపు అలవాట్లు, లైఫ్ైస్టెల్ మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అపార్ట్మెంట్లో నుంచి కిందకు రాగానే బైక్ కిక్ కొడుతున్నాం.. ఆఫీస్ కాడ అపుతున్నాం.. కూరగాయలు, దుకాణానికి వెళ్లాలన్నా బండ్లమీదనే పోతున్నాం.. నడక అనేది లేదు చెమట చుక్క కిందపడ్తలేదు. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి.
ఇటీవల ఓ సర్వేలో దేశంలో ఎక్కువ నాన్వెజ్ తినే రాష్ర్టాల్లో 99 శాతం మనకు వచ్చింది. అతి తక్కువగా రాజస్థాన్ రాష్ట్రంలో 36 శాతం నాన్వెజ్ తినేటోళ్లు ఉన్నారు. ఎక్సర్సైజ్ చేయకపోవడంతో బీపీ, షుగర్ బారిన పడుతున్నామని మంత్రి అన్నారు. చిన్న వయస్సులో 30 ఏండ్ల పిల్లలకు కూడా బీపీ, షుగర్ వస్తున్నాయన్నారు. దీనికి కారణం అయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, రోడ్ల మీద తిండి ఎక్కువవ్వడంతో ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అందుకోసమే ప్రతిఒక్కరూ విధిగా అర గంట ప్రాణాయామం, యోగ, వాకింగ్ చేసి ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. కొందరైతే టైమేలేనట్టు చేస్తారు.. ఫోన్లల్లో మాత్రం గంటల పాటు మాట్లాడుతారు.. అలా చేయకుండా మనకోసం మనం మారాలన్నారు. థీమ్ పార్కులో అవసరమైతే యోగా టీచర్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యంగా ఉంటే మనం నిజమైన ధనవంతులమని.. ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు.
డివిజన్లో ఆలయాన్ని నిర్మిస్తాం
కార్పొరేటర్ పుష్పానగేశ్ తమ దృష్టికి పలు ప్రతిపాదనలు తీసుకువచ్చారు. శ్రీసాయినగర్లో ఆలయ నిర్మాణానికి సంబంధించి వివాదం కోర్టులో ఉన్నదని, ఇరు వర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కరించి ఆలయాన్ని నిర్మిస్తామని మంత్రి అన్నారు. కాకతీయనగర్లో స్పోర్ట్ కాంప్లెక్స్, మయూరినగర్లో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తమ్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేశ్, తహసీల్దార్ జయరాం, భారతీనగర్, పటాన్చెరు కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్రెడ్డి, మెట్టుకుమార్యాదవ్, తెల్లాపూర్ మున్సిపాల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ విజయ్, వైస్చైర్మన్ మల్లారెడ్డి, పటాన్చెరు జడ్పీటీసీ సుప్రజ, ఎంపీపీలు సుష్మశ్రీ, దేవానంద్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, డివిజన్ అధ్యక్షుడు గోవింద్, ఏఎంసీ డైరెక్టర్లు ఐలేశ్, సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు కుమార్గౌడ్, గఫార్, మహేందర్రెడ్డి, బేకుయాదయ్య, ఎంఏఖాన్, సోహైల్, చాంద్, రమేశ్, వినయ్కుమార్, వివిధ కాలనీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రిపై పూల వర్షం..
శ్రీసాయినగర్కాలనీలో థీమ్ పార్కు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి తన్నీరు హరీశ్రావుపై కాలనీ వాసులు పూలవర్షం కురిపించారు. మంత్రి కాలనీలోకి ప్రవేశించగానే బిల్డింగ్లపై నుంచి మహిళలు మంత్రిపై పువ్వులు చల్లారు. దారిపొడువునా మంత్రి వారికి అభివాదం చేశారు.
రూ.20 కోట్ల ప్రభుత్వ ఆస్తిని పార్కుగా అభివృద్ధి చేశాం
శ్రీసాయినగర్కాలనీలో 18 గుంటల ప్రభుత్వ భూమి అంటే రూ.20 కోట్ల ఆస్తిని కాలనీవాసుల కోరిక మేరకు థీమ్ పార్కుగా అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లో రూ. 17.77 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని, నియోజకవర్గంలో పార్కులు, అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. శ్రీసాయినగర్కాలనీలో ఆలయాన్ని కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆర్సీపురంలో వాడవాడలా మంత్రికి, తమకు ప్రజలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారని, చాలా సంతోషంగా ఉన్నదన్నారు. అనంతరం ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే సారధ్యంలో పటాన్చెరు నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మనందరి ఆత్మీయుడు మంత్రి హరీశ్రావు అన్న అన్నారు. ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల కార్పొరేటర్లు బాగా పనిచేస్తున్నారన్నారు.