మెదక్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ) : కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయకపోతే మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరుగుతుందని ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ సాగు నీరు మహా ప్రభో ’ అనే కథనానికి అధికారులు స్పందించారు. సాగు నీటి కోసం రైతులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనలు పత్రికల్లో వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హల్దీవాగులోకి కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేసింది.
హల్దీవాగు పై మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో ఉన్న చెక్డ్యామ్లు పొంగిపొర్లుతున్నాయి. హల్దీవాగులో నీరు ప్రవహించడంతో రైతులు ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. హల్దీవాగులోకి సాగునీటిని విడుదల చేయడంతో మెదక్ జిల్లా తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, చిన్నశంరంపేట, చేగుం ట, కుల్చారం రైతులకు మేలు కలుగుతుంది. చెక్డ్యామ్లు నిండిపోవడంతో పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంది.
హల్దీవాగు వెంట ఉన్న రైతులకు వాగునీరు ఆధారం. వర్షాలకు ప్రవహించే వాగునీరు ఆధారంగా పంటలు సాగు చేసుకున్నాం. వాగులో నీరు ఎండిపోవడంతో సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఉండేవి. సాగుచేసిన భూమిలో సగం ఎండిపోవడం, ఎండలు ఎక్కువగా ఉంటే వేసిన పంటమొత్తం ఎండిపోయేది. బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత గోదావరి నీళ్లు పారుతుండడంతో యాసంగి పంటలకు ఢోకాలేదు.
-నర్సింహులు, రైతు, దామరంచ (మెదక్ జిల్లా )
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ప్రవహిస్తున్న హల్దీవాగు వెంట వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాం. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలో కూడా వాగులో నీళ్లు ప్రవహించి చెక్డ్యామ్లు పొంగిపొర్లాయి. యాసంగి పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందింది. వర్షాలు ఆలస్యంగా పడినా పంటలకు నీటి సమస్య ఉండదు. రైతుల సమస్యలు వెలుగులోకి తీసుకువస్తున్న ‘నమస్తే తెలంగాణ’కు రుణపడి ఉంటాం.
-వేన్నవరం మహేందర్రెడ్డి,రైతు, ఆరెగూడెం ( మెదక్ జిల్లా)