మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 3: ఈవీఎంల మొదటి ర్యాండమైజైషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం నియోజకవర్గాల వారీగా మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరుకు కేటాయించిన యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ల ర్యాండమైజేషన్, ఈఎమ్ఎస్ వారు రూపొందించిన సాప్ట్వేర్ను వినియోగిస్తూ ఆన్లైన్లో ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించినట్లు కలెక్టర్ వెల్లడించారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 584 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మొత్తం బ్యాలెట్ యూనిట్లు 729, కంట్రోల్ యూనిట్స్ 729, వీవీ ప్యాడ్స్ 816ల మొదటి విడత ర్యాండమైజేషన్ ఎన్నికల నిబంధనల మేరకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో 4 జిల్లాల రేట్ చార్ట్లు రూపొందించి, సంబంధిత జిల్లాలకు పంపించామని తెలిపారు. త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏకరూప ధరల పట్టికను ధృవీకరించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయనున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల పర్యవేక్షకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఓటు అనేది వజ్రాయుధం లాం టిది, అలాంటి ఓటును ఎలాంటి ప్రలోభాలకు తలోగ్గకుండా స్వేచ్ఛయుతంగా వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఓటింగ్ శాతం పెరగడానికి కృషి చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో బుధవారం కలెక్టరేట్లో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు సంబంధించి స్వీప్-2024 కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి త మవంతుగా కృషి చేయాలన్నారు. సమావేశంలో స్వీప్ కోర్ కమిటీ సభ్యు డు రాజిరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్, జడ్పీ సీఈవో ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.