సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని సంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి కె.ప్రభాకర్రావు అన్నారు. ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన సుచించారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్సవానికి నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ దేశంలో అన్ని ప్రాంతాలు, కులాలు, మతాల వారు సామూహికంగా జరుపుకొనే పండగ ఓటరు దినోత్సవమన్నా రు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 14,24,123 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 43,834 మంది 18 నుంచి 19 ఏండ్ల యువ ఓటర్లు ఉన్నారన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదని జిల్లా ఎస్పీ రూపేశ్ తెలిపారు. 2011 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైందని, ఈ సందర్భంగా ఏటా జాతీయ ఓటు దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రతి పౌరుడు స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే అవకాశం ఉన్నదన్నారు. అనంతరం సీనియర్ ఓటర్లు, యువ ఓటర్లను ఘనంగా సన్మానించారు. బీఎల్వోలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా న్యాయమూర్తి అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు స్థానిక ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ఓటరు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆయా శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.