గణేశ్ నిమజ్జనోత్సవాన్ని శుక్రవారం మెదక్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మండపాల్లోని గణపయ్యలను కోలాటాలు, మేళతాళాలు, నృత్యాలతో గంగమ్మ ఒడికి చేర్చారు. బోలో గణేశ్ మహారాజ్ కీ జై నినాదాలతో అంతటా ఆధ్యాత్మిక భావం వెల్లువెత్తింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన శోభాయాత్ర వేడుకలా సాగింది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వేడుకల్లో పాల్గొని కోలాటం ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
– మెదక న్యూస్నెట్వర్క్, సెప్టెంబర్ 29
పెద్దశంకరంపేట/చిన్నశంకరంపేట/రామాయంపేట/నిజాంపేట, సెప్టెంబర్ 29: పెద్దశంకరంపేట మండలంలో వినాయక నిమజ్జనోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. పెద్దశంకరంపేట పట్టణంలో వినాయకుడితో పాటు పలు గణనాథలను అందంగా అలంకరించిన ప్రత్యేక వాహనాల్లో వినాయక విగ్రహలను పుర వీధుల్లో ఊరేగించారు. విగ్రహాల ఎదుట యువకులు భజనలు, కీర్తనలు ఆలపిస్తూ, నృత్యాలు, భజనలు చేస్తూ సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్థానిక తిరుమలాపురం చెరువులో నిమజ్జనం చేశారు.
* పెద్దశంకరంపేట మండలంలోని మాధవనగర్ కాలనీలో వినాయకుడి మండపం వద్ద లడ్డూను ఆరెపల్లి గ్రామానికి చెందిన వెంకట్రావ్కు రూ.1,11, 111లకు దక్కించుకోగా, రెండో లడ్డూను రూ.71, 111లకు బుడాల నరేశ్ దక్కించుకున్నారు. రామోజీపల్లిలో మాజీ ఎంపీపీ బాసాడ రాజు రూ.1.05 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
* చిన్నశంకరంపేటతో పాటు మండలంలో వివిధ గ్రామాల్లో శుక్రవారం గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గణేశ్ మండపాల వద్ద ఆది నాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. కొన్ని గ్రామాల్లో గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక విగ్రహాలను గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా ఊరేగించి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు.
* రామాయంపేట పట్టణంలోని వినాయక విగ్రహాలను ఘనంగా నిమజ్జనాలకు తరలించారు. శుక్రవారం పట్టణంలోని గొల్పర్తి రోడ్డులో ఉన్న విఘ్నేశ్వరున్ని మహిళా భక్తులు ఆటపాటలతో కోలాటాలు ఆడుతూ ఘనంగా ఊరేగింపు నిర్వహించా రు. వినాయకుడి మండపం వద్ద అన్నదానం చేశారు.
* నిజాంపేట మండల వ్యాప్తంగా మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథుల విగ్రహాలు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాయి. ఈ మేరకు స్థానిక మల్కచెరువులో శుక్రవారం నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. చెరువు వద్ద ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ప్రజాప్రతినిధులు, అధికార సిబ్బంది విద్యుత్ ద్వీపాలను ఏర్పాటు చేశారు.