చేర్యాల, నవంబర్ 19 : జనగామ నియోజకవర్గంలోని ప్రజలకు తన నీలిమా దవాఖానలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని, ప్రజా సేవ చేసేందుకు వచ్చానని, తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలను కోరారు. పల్లా రాజేశ్వర్రెడ్డి రోజురోజుకూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం పల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బీడీ కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం చేర్యాల పాత బస్టాండ్ వద్ద ఓ సెలూన్కు సామాన్య వ్యక్తిగా వెళ్లి షేవింగ్ చేయించుకున్నారు. అనంతరం వీరభద్ర సినిమా టాకీస్ ప్రదేశంలోని రోడ్డు పక్కనే ఉన్న ఓ చాయ్ దుకాణం వద్దకు వెళ్లి ప్రజలు, దుకాణాదారులతో కలిసి లెమన్ టీ తాగారు. ఈ సందర్భంగా షాపుల యాజమానులను కలిసి బీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బీడీ కాలనీలో జరిగిన ప్రచారంలో పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల కోసం బ్రహ్మండమైన మ్యానిఫెస్టో తయారు చేశారని, ప్రజలు దీవిస్తే వాటిని అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అధికారంలోకి రాకముందే రాచకొండ భూములను అమ్ముతామని రేవంత్రెడ్డి అంటున్నాడని, వారిని నమ్మితే అధోగతి తప్పదని హెచ్చరించారు. ఎన్నికలు రాగానే అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చి..
ఎన్నికలు ముగియగానే మాయమైపోయే వ్యక్తిని కాదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. గ్రామాలభివృద్ధి చేసే బాధ్యత నాదని, బీఆర్ఎస్కు ఓట్లు వేసే బాధ్యత ప్రజలదన్నారు. ఘటకేసర్లో ఉన్న తన వైద్య కళాశాల(నీలిమా)లో జనగామ నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. రేషన్కార్డు తీసుకుపోతే అక్కడ నియోజకవర్గ ప్రజలకు వైద్యసేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. నేను పక్కా లోకల్ వ్యక్తినని, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి తాను స్థానికుడిని కాదని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. చేర్యాల ప్రాం తానికి తీరని అన్యాయం చేసిన వ్యక్తిని ప్రజలు నమ్మొద్దన్నారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తితోనే చేర్యాల నియోజకవర్గం గల్లంతు అయ్యిందన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకంతో ప్రతి ఇంట మహిళకు నెలకు రూ.3 వేలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పా రు. ఇక దొడ్డు బియ్యం సరఫరా ఉండదని, సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణీశ్రీధర్రెడ్డి, కౌన్సిలర్ ఆడెపు నరేందర్, బీఆర్ఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శి పచ్చిమడ్ల సాయికిరణ్గౌడ్, నాయకులు గోనే హరి, వకులాభరణం నర్సయ్య పంతులు, ఆది శ్రీనివాస్, కూరపాటి మధు, బుడిగె గురువయ్యగౌడ్, నాగుల వెంకటేశ్, నాగమల్ల శ్రీనివాస్, ఎనిమల్ల శ్రీధర్, పరశురాములు, రాజు, సుభాష్, ముజ్జు, నరేశ్, వినయ్, మహేశ్, ప్రవీణ్, రాకేశ్ పాల్గొన్నారు.