జగదేవపూర్, జూన్ 5: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం జగదేవపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు వానకాలం సీజన్ ప్రారంభమై వానలు కురిసి, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతుందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు.
రైతులు ఎర్రటి ఎండల్లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రెండు నెలలు గడుస్తున్నా.. గన్నీ బ్యాగులు లేక, లారీలు పంపక, మిల్లుల్లో ధాన్యం దించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.గజ్వేల్ నియోజకవర్గంలోని 120 కొనుగోలు కేంద్రాల్లో ఇంకా 60 వరకు లారీలు ధాన్యం లోడ్లతో ఉన్నట్లు తెలిపారు. మ్యాచర్ లేకుండా, తరుగు తీయకుండా తడిసినా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అవసరమైన గన్నీ బ్యాగులు, ట్రక్కులు అందుబాటులో ఉంచి, వేగంగా ధాన్యం తరలించి రైతులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, జగదేవపూర్ సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ సుధాకర్రెడ్డి, మునిగడప మాజీ ఎంపీటీసీ కిరణ్గౌడ్, జగదేవపూర్ మాజీ ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శేఖర్గుప్తా, బుద్దనాగరాజు, భూమయ్య, గణేశ్, ఐలయ్య, కరుణాకర్ తదితరులు ఉన్నారు.