మెదక్: వానాకాలం ప్రారంభంలో జిల్లాలో వర్షాలు జోరుగా కురిశాయి. ఆగస్టులో రెండో వారం వరకు వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో ఎండలు కూడా దంచికొట్టాయి. దీంతో పంటలు నీరు లేక వాడిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం రైతులకు ఊరటనిచ్చింది. గత రెండు నెలల్లో కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, కంది పంటలు సాగు చేశారు. అయితే 20 రోజులుగా వర్షాలు లేక మొలకెత్తిన పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటలు వాడిపోయే స్థితికి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం పంటలకు ఊరిపిపోసినట్టయింది.
పంటలకు ఊపిరి పోసిన వర్షం..
ప్రస్తుతం వర్షాలతో పంట దిగుబడి సైతం పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ మొదటి వారం నుంచే వర్షాలు కురవడంతో సాగుకు ఉప క్రమించారు. జిల్లాలోని రైతులు ఎప్పటిలాగే వరి వైపు మొగ్గు చూపారు. వరి నాటిన నుంచి అనువైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కలుపుతీసుకోవడం, ఎరువులను చల్లడం, సస్యరక్షణ చర్యలు చేపట్టడం వంటి పనులు చేపడుతున్నారు. అయితే గత 20 రోజులుగా వర్షాలు కురవని కారణంగా వరి పంటలు కొంత వాడు పడుతున్న దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో ప్రస్తుతం కురిసిన వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో 3లక్షల 9వేల 665 ఎకరాల్లో సాగు
మెదక్ జిల్లాలో 3 లక్షల 9వేల 665 ఎకరాల్లో పంటలను రైతులు సాగు చేశారు. అందులో వరి లక్షా 85వేలు అంచనా కాగా, 2 లక్షల 16వేల 540 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. పత్తి 95వేల ఎకరాలు కాగా, 69వేల 490 ఎకరా ల్లో సాగు చేయగా, కంది 30వేల ఎకరాలు కాగా 9315 ఎకరాల్లో సాగు చేశారు. ఇలా అన్ని పంటలు కలిపి 3 లక్షల 9 వేల 665 ఎకరాల్లో పంటలను సాగు చేశారు. ఇదిలావుండగా సాగు రైతుల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ముందుగానే విత్తనాలు, ఎరువులను అందుబాటులో కి తీసుకువచ్చారు. ఈ ఏడాది జిల్లాలో 38,200 మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ 4260 మెట్రిక్టన్నులు, ఎస్ఎస్పీ 2700 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 14,500 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 5550 మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉంచి సరఫరా చేశారు.
వర్షాలు పంటలకు అనుకూలంపరుశురాంనాయక్ : వ్యవసాయ శాఖ జిల్లా అధికారి
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు అనుకూలంమైనవి. ఎరువులు వేసేందుకు, కలుపు తీసేందుకు ఇదే సరైన సమ యం. గత 20 రోజులుగా వర్షాలు కురవక పోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. గత మూడు రోజులుగా వర్షం కురు స్తుండడంతో రైతన్నలు సంతోషంగా ఉన్నారు. ఈ వానకాలంలో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడులు కూడా పెరిగే అవకాశముంది.