మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 22 ః హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే ప్రధాన పండుగల్లో వైకుంఠ ఏకాదశమి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంతో మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ఏటా 24 ఏకాదశిలు వస్తుంటాయి. అందులో సూర్యగ్రమనం ప్రకారం ధనుర్మాసంలో శుక్లపక్షమి ఏకాదశి, పుత్రత ఏకాదశి అని పిలుస్తారు. శ్రీహరికి ఇష్టమైన ప్రదేశం వైకుంఠం. ఇష్టమైన తిథి ఏకాదశి. అలాంటి ఏకాదశుల్లో అత్యంత ప్రాధాన్యమున్నదే వైకుంఠ ఏకాదశి. స్వర్గధామం, ముక్కోటి ఏకాదశి అని పిలిచే ఈ ఏకాదశిని వైష్ణవ ఆలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
పాలసంద్రాన్ని దేవదానవులు చిలకగా ముక్కోటి ఏకాదశి రోజునే హాలాహలం, అమృతం కూడా ఉద్భవించాయని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ హాలాహలాన్ని దేవతల కోరిక మేరకు పరమశివుడు మింగి గరుత్మంతుడిగా పేరు పొందాడు. సంద్రం నుంచి లభించిన అమృతాన్ని విష్ణుమూర్తి దేవతలకు పంచాడని, ఇదే రోజున జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించాడని ప్రతీతి. విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు అసురుల అభ్యర్థన మేరకు ముక్కోటి ఏకాదశి రోజునే వైకుంఠ ద్వారాలు తెరిచి విష్ణుదర్శన భాగ్యం కల్పించారట. ఈ రోజు విష్ణువును జాజీ పూలతో అర్పించడం, పాయసం వంటి తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లు నైవేథ్యంగా సమర్పించి స్తుతించడం శుభప్రదమని వేదపండితులు చెబుతున్నారు.
దశమినాటి రాత్రి నిరాహారులై ఉండాలి.
ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండాలి.
సత్యవ్రతాన్నే వచించాలి.
అబద్ధాలు చెప్పొద్దు.
స్త్రీ సాంగత్యం పనికిరాదు.
చెడు పనులు, దుష్ణతలంపులు చేయరాదు.
రోజంతా జాగరణ చేయాలి. ఏకాదశినాడు అన్నదానం చేయాలి.
ఉత్తర ద్వార దర్శనం చేసుకోనున్న ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం 4 గంటలకు జిల్లా కేంద్రం మెదక్లోని కోదండ రామాలయం, వేంకటేశ్వర దేవాలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు ఆయా ఆలయ కమిటీలు అధ్యక్షులు తెలిపారు.
మహావిష్ణువుకు ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో విష్ణువును దర్శించుకోవడం మోక్షదాయకమని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున వైకుంఠ సప్తద్వారాలు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారంగా భావించి వేకువజాము నుంచే భగవత్ దర్శనార్థం భక్తులు నిరీక్షిస్తారు. ఇదే రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భువికి వచ్చి దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. సూర్యోదయానికి ముందే స్నాన, సంద్యాధులు పూర్తి చేసుకుని దేవాలయానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే ఆ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం.
ఉత్తర ద్వార దర్శనం శనివారం వేకువజామునే (ఉదయం 4 గంటల నుంచి) ప్రారంభమై రోజంతా కొనసాగుతుంది. ఉదయం పది గంటలలోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని వేద పండితులు తెలుపుతున్నారు. ఈ రోజున విష్ణు భగవాణుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని దేవాలయాలన్నీ ముస్తాబయ్యాయి.