రామాయంపేట : టీకాపై ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం ఆమె రామాయంపేటకు విచ్చేసి అక్కడ ఏర్పాటు చేసిన మూడు కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించి వైద్య సిబ్బందితో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలన్నారు. టీకా కోసం ప్రభుత్వం ప్రతి గ్రామంలో శిబిరాలను ఏర్పాటు చేసిందన్నారు. పట్టణాల్లోనూ శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నేరుగా వారి ఇండ్లకెళ్లి టీకాలను ఇవ్వాలని వైద్య సిబ్బందికి సూచించారు. అదనపు కలెక్టర్ వెంట రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్, టీఆర్ఎస్ నాయకులు కన్నపురం కృష్ణాగౌడ్, బాలుగౌడ్, సిబ్బంది కాలేరు ప్రసాద్, నవాత్ ప్రసాద్, శ్రీనివాస్, శంకర్, నరేశ్ తదితరులున్నారు.