వీ2ఎక్స్ టెక్నాలజీ ప్రయోగ పరీక్ష విజయవంతం
ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ప్రయోగ పరీక్ష
ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక ముందడుగు
సంగారెడ్డి, మే 11(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో మరో ఘనతను సాధించింది. నూతన ఆవిష్కరణల్లో ముందున్న ఐఐటీ హైదరాబాద్, దేశంలోనే మొట్టమొదటి సారిగా బుధవారం వీ2ఎక్స్(వెహికల్ టూ ఎవ్రిథింగ్) టెక్నాలజీ పరీక్షను విజయవంతంగా పరీక్షించింది. మారుతి-సుజుకి, ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని మారుతి సుజుకికి చెందిన రెండు ప్రోటోటైప్ వాహనాల్లో వీ2ఎక్స్ పరికరాలను అమర్చి ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో వీ2ఎక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అరగంట పాటు సాగిన ఈ పరీక్ష విజయవంతమైంది. ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక ముందడుగు ఈ టెక్నాలజీ బీజం వేయనున్నది.
రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట…
సుజుకి మోటార్ జపాన్, ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన నూతన వీ2ఎక్స్ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్టపడనుంది. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరగడానికి వాహనదారుల నిర్లక్ష్యంతోపాటు వాహనాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా వ్యవస్థ, పరికరాలు బిగించకపోవడం ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. దేశంలో వాహనాల ప్రమాదాలను అరికట్టేందుకు వీ2ఎక్స్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిచేస్తుందని వీ2ఎక్స్ ప్రాజెక్టు ఇన్చార్జి ప్రత్యూష తెలిపారు. వీ2ఎక్స్ పరికరాలు అమర్చిన వాహనాల్లో అంబులెన్స్ హెచ్చరిక వ్యవస్థ, రాంగ్వే డ్రైవర్ అలర్టింగ్ సిస్టమ్, పాదచారుల హెచ్చరిక వ్యవస్థ, మోటార్ సైకిల్ అలర్ట్ అందుబాటులోకి వస్తాయి. తద్వారా రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు వీలు ఉంటుంది.
వీ2ఎక్స్ అంబులెన్స్ హెచ్చరిక వ్యవస్థ: దేశంలో ప్రస్తుతం ఎక్కడైనా రహదారిపై అంబులెన్స్లు వచ్చినా, ట్రాఫిక్లో చిక్కుకున్నా వాహనదారులు వెంటనే అంబులెన్స్లకు దారి ఇవ్వడం లేదు. ఫలితంగా అంబులెన్స్లో అత్యవసర వైద్యసేవలు అవసరమైన రోగులు దవాఖానలకు వెళ్లలేక చాలా సందర్బాల్లో మార్గమద్యలో మృతి చెందుతున్నారు. దీనిని అరికట్టేందుకు వీ2ఎక్స్లోని అంబులెన్స్ హెచ్చరిక పనిచేస్తుంది. వీ2ఎక్స్ పరికరం అమర్చిన కారుకు అంబులెన్స్ చేరువ అవుతున్న సమయంలో కారులోని కమ్యూనికేషన్ వ్యవస్థ డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. అలాగే రియల్ టైమ్లో అంబులెన్స్కు వాహనాలు దారి ఇచ్చేలా వీ2ఎక్స్ టెక్నాలజీ పనిచేస్తుంది. వీ2ఎక్స్లోని అలర్ట్ సిస్టమ్ రియల్ టైమ్ ప్రాతిపదికన వాహనాల మద్య ఎంత దూరం ఉంది, ఎన్ని నిమిషాల్లో గమ్యస్థానం చేరవచ్చు, క్లియర్ ట్రాఫిక్ రూట్లను అంబులెన్స్ డ్రైవర్కు సూచిస్తుంది.
వీ2ఎక్స్ రాంగ్ వే డ్రైవర్ అలర్టింగ్ సిస్టమ్: తప్పుడు మార్గంలో వస్తూ తమకు ఎదురుగా వచ్చే డ్రైవర్ ఉనికికి సంబంధించి వీ2ఎక్స్ కమ్యూనికేషన్ ముందస్తు హెచ్చరికలు ఇస్తుంది. తద్వారా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
పాదచారుల హెచ్చరిక వ్యవస్థః వీ2ఎక్స్ కమ్యూనికేషన్ ఉపయోగించి కారుకు అడ్డుగా వచ్చి ఢీకొనే అవకాశం ఉన్న సమీపంలోని పాదచారుల గురించి డ్రైవర్లకు ముందస్తుగా అప్రమత్తం చేస్తుంది. పాదచారులను ఢీకొట్టకుండా డ్రైవర్లు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు పాదచారుల హెచ్చరిక వ్యవస్థ పనిచేస్తుంది.
మోటార్ సైకిల్ అలర్ట్ సిస్టమ్ : ప్రమాదం జరిగే ప్రదేశాల్లో(బ్లైండ్ స్పాట్) వేగంగా వచ్చి వాహనాలను ఢీకొట్టే టూ వీలర్ల గురించి వీ2ఎక్స్ కమ్యూనికేషన్ ముందుగానే గుర్తించి డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. టూవీలర్ వాహనం దూరం, దిశలను గుర్తించి డ్రైవర్ను రియల్ టైమ్లో అప్రమత్తం చేస్తుంది. తద్వారా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారిస్తుంది.
రోడ్ కండిషన్ అలర్ట్ సిస్టమ్: పాడైన రహదారుల గుర్తించి వాహన డ్రైవర్ను వీ2ఎక్స్ వ్యవస్థ ముందుగానే అప్రమత్తం చేస్తుంది. ప్రయాణంలో జాగ్రత్తగా ముందుకువెళ్లమని డ్రైవర్కు సూచిస్తుంది.
తెలుగుమ్మాయి ప్రత్యూష కీలకపాత్ర…
సుజుకి మోటార్స్, ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నూతన వీ2ఎక్స్ టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో తెలుగుఅమ్మాయి ప్రత్యూష కీలక పాత్ర పోషించింది. విశాఖపట్నానికి చెందిన ప్రత్యూష పదో తరగతి వరకు హైదరాబాద్లోని మదీనగూడలోని సెయింట్ ఆన్స్లో చదువుకుంది. ఇంటర్మీడియట్ వైజాగ్లో పూర్తి చేసింది. ఆతర్వాత ఐఐటీ హైదరాబాద్లో బీటెక్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ 2014-18లో పూర్తి చేసింది. బీటెక్ పూర్తి చేసిన అనంతరం కొద్దికాలం స్టార్టప్ కంపెనీలో ప్రత్యూష పనిచేసింది. ఆ తర్వాత జపాన్లోని సుజుకి మోటార్ కార్పొరేషన్లో ఉద్యోగానికి ప్రత్యూష ఎంపికైంది. సుజికి మోటార్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ప్రత్యూష వీ2ఎక్స్ టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం వీ2ఎక్స్ ప్రాజెక్టు ఇన్చార్జిగా ప్రత్యూష వ్యవహరిస్తున్నది. ఐఐటీ హైదరాబాద్కు చెందిన మరో పూర్వ విద్యార్థి విపుల్ జిందాల్తో కలిసి వీ2ఎక్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ప్రత్యూష తెలిపింది. భారతదేశంలో మొదటిసారిగా వీ2ఎక్స్ ప్రయోగ పరీక్ష విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసింది.
నూతన ఆవిష్కరణల్లో కీలక పాత్ర
– ఐఐటీ హైదరాబాద్ డైరక్టర్ బీఎస్ మూర్తి
ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఐఐటీ హైదరాబాద్-సుజుకి కార్పొరేషన్ సంయుక్తంగా వీ2ఎక్స్ టెక్నాలజీని అభివృద్ధి చేశామన్నారు. వీ2ఎక్స్ రూపకల్పనలో ఐఐటీ పూర్వ విద్యార్థులు ప్రత్యూష, విపుల్ జిందాల్ కీలకపాత్ర పోషించడం ఆనందంగా ఉందన్నారు. వీ2ఎక్స్ టెక్నాలజీ అమలు కోసం అవసరమయ్యే 5జీ టెక్నాలజీని సైతం ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసినట్లు చెప్పారు. మానవాళికి అవసరమయ్యే నూతన ఆవిష్కరణల్లో ఐఐటీ హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. మానవరహిత వాహనాల తయారీలో ఐఐటీ ముందడుగు సాధించినట్లు చెప్పారు. మానవరహిత వాహనాల పనితీరును పరీక్షించేందుకు రెండు కిలోమీటర్ల రహదారిని సిద్ధ్దం చేశామని తెలిపారు. మానవరహిత వాహనాల పనితీరును ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో జూలైలో పరీక్షించనున్నట్లు తెలిపారు.
విప్లవాత్మక ముందడుగు
– సుజుకి కార్పొరేషన్ మేనేజర్ కజునోబు హోరి
సుజుకి కార్పొరేషన్ జపాన్ పరిశోధన విభాగం ప్రోగ్రామ్ మేనేజర్ కజునోబు హోరి మాట్లాడుతూ.. వీ2ఎక్స్ టెక్నాలజీ అభివృద్ధి చేయటంలో సుజుకి మోటార్స్ రీసెర్స్ బృందంతో పాటు ఐఐటీ హైదరాబాద్ కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. వీ2ఎక్స్ ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మకమైన ముందడుగుగా పేర్కొన్నారు.
ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణకు దోహదం..
– మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి
మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి మాట్లాడుతూ.. వీ2ఎక్స్ టెక్నాలజీ విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. వీ2ఎక్స్ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలు నివారించడంతో పాటు ట్రాఫిక్ను నియంత్రించవచ్చని తెలిపారు. వీ2ఎక్స్ను వాడకంలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఇతర స్టేక్ హోల్డర్స్ ముందుకు రావాలని కోరారు.
త్వరలో 5జీ టెక్నాలజీ సేవలు..
– టెలికాం డిప్యూటీ డైరక్టర్ జనరల్ కిశోర్బాబు
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డిప్యూటీ డైరక్టర్ జనరల్ కిశోర్బాబు మాట్లాడుతూ.. వీ2ఎక్స్ టెక్నాలజీ ప్రయోగపరీక్ష విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. 5జీ ఆధారంగా వీ2ఎక్స్ టెక్నాలజీ పనిచేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టెలికం శాఖ పనిచేస్తున్నదన్నారు. కమ్యూనికేషన్ టెకాల్నజీ రంగానికి సంబంధించిన స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు డిపార్టుమెంట్ ఆఫ్ టెలికాం సిద్ధ్దంగా ఉన్నట్లు చెప్పారు.
త్వరలో స్ప్రెక్టమ్ వేలం…
– టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సలహాదారు మునిశేఖర్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సలహాదారు మునిశేఖర్ మాట్లాడుతూ.. 5జీ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకోసం త్వరలోనే స్ప్రెక్టమ్లను వేలం వేస్తామన్నారు. 5జీ సేవలను అందించేందుకు వీలుగా కాండ్లా పోర్టు, ఢిల్లీ ఎయిర్పోర్టు, ముంబయి మెట్రో, భోపాల్ పట్టణంలో చిన్న తరహా పరికరాలను అమరుస్తున్నట్లు చెప్పారు. 5జీ సేవలను ప్రజలకు అందించేందుకు వీలుగా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధ్దం చేసుకోవడంలో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. 5జీ నెట్వర్స్ పనిచేసేందుకు అవసరమైన పరికరాలు అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.