తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బతుకమ్మచీరలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళా కేంద్రాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రభుత్వం అతివలకు అండగా నిలబడుతున్నది. పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవసరమైన చోట కొత్తగా అంగన్వాడీ భవనాలను నిర్మించి అన్ని సౌలతులు కల్పించింది. ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేసింది.అంగన్వాడీ టీచర్లకు కేంద్రం రూ. 4,200 వేతనం అందజేయగా, బీఆర్ఎస్ సర్కారు రూ.13,650కు పెంచింది. ఆశవర్కర్ల వేతనాలను రూ.6వేల నుంచి రూ.9500 చేసింది. ప్రతిఏటా లక్షలాది మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారం అందజేస్తున్నది. గతంలో ప్రసూతి సెలవులు 90 రోజులు ఉండగా ప్రస్తుతం 180 రోజుల వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవిస్తే కేసీఆర్ కిట్తోపాటు ప్రోత్సాహకంగా మగబిడ్డకు రూ.12వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13వేలు నగదు సాయం అందిస్తున్నది.
– సంగారెడ్డి /మెదక్, (నమస్తే తెలంగాణ), జూన్ 12
సంగారెడ్డి జూన్ 12(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మహిళలు మహారాణులుగా వెలిగొందుతున్నారు. రాష్ట్రంలో మహిళాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సీఎం పెద్దపీట వేశారు. ఉమ్మడిరాష్ట్రంలోని పాలకులు మహిళాసంక్షేమాన్ని విస్మరించారు. మహిళలు తమ హక్కుల కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉమ్మడి పాలనలో ఉండేది. రక్తహీనతతోపాటు పలు ఆరోగ్యసమస్యలతో మహిళలు ఇబ్బందులు పడుతున్నా ఆంధ్రపాలకులు పట్టించుకోలేదు. మాతా, శిశు మరణాలు పెరిగినా నిర్లక్ష్యం వహించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ మహిళాసంక్షేమానికి పెద్దపీట వేశారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించటంతోపాటు ప్రభుత్వంలోని మహిళా ఉద్యోగులకు వేతనాలను గణనీయంగా పెంచారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు వేతనాలు రెట్టింపు చేశారు. కేసీఆర్ పాలనలో మాతా శిశు మరణాలు తగ్గటంతోపాటు రక్తహీనత సమస్యతో ఇబ్బందిపడుతున్న మహిళల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మహిళల కోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, ఆరోగ్యమహిళ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మహిళాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయి. ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుండడంతో జిల్లాలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంపు..
మహిళల కోసం కేసీఆర్, న్యూట్రిషన్ కిట్లు
సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, ఆశ వర్కర్ల వేతనాలను గణనీయంగా పెంచారు. సంగారెడ్డి జిల్లాలో 1,332 మంది ప్రధాన అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీల్లో 162 టీచర్లు, 1,264 మంది అంగన్వాడీ కేంద్ర సహాయకులు పని చేస్తున్నారు. 2014లో ప్రధాన అంగన్వాడీ కేంద్రం టీచర్లకు ప్రభుత్వం రూ.4,200 వేతనం అందజేసేది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రధాన అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.13,650కు పెంచారు. మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు గతంలో రూ.2,150 వేతనం ఉండగా ప్రస్తుతం రూ.7,800 వేతనాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. గతంలో మహిళాఉద్యోగులకు ప్రసూతి సెలవులు 90 రోజులు ఉండగా ప్రస్తుతం 180రోజుల సెలవులను తెలంగాణప్రభుత్వం ఇస్తోంది. ఆశ వర్కర్ల వేతనాలను ప్రభుత్వం రూ.6వేల నుంచి రూ.9,500కు పెంచింది. పోలీసుశాఖలో ప్రభుత్వం మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రభుత్వం రిజర్వేషన్ అమలుచేస్తోంది. ఇదిలాఉంటే మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య సేవలు అందజేసేందుకు ప్రభుత్వం ఆరోగ్య మహిళాకేంద్రాలను నిర్వహిస్తోంది. సంగారెడ్డిలో ప్రస్తుతం మూడు మహిళా ఆరోగ్య కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వారంలో ఒకరోజు పూర్తిగా కేవలం మహిళలకు మహిళా వైద్య అధికారులు, సిబ్బంది వైద్యపరీక్షలు చేసి చికిత్స అందజేస్తున్నారు. అలాగే గర్భిణులకు ప్రభుత్వం కేసీఆర్ కిట్లు అందజేస్తుంది. త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేయనున్నది.
అంగన్వాడీలకు సొంత భవనాలు
మాతా శిశు సంరక్షణ కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 1,504 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఉమ్మడి పాలనలో అంగన్వాడీ కేంద్రాలకు 445 సొంత భవనాలు ఉండేవి కాగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 550 అంగన్వాడీ భవనాలను నిర్మించింది. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 87 అంగన్వాడీ టీచర్లు, 87 ఆయా పోస్టులను భర్తీ చేసింది. 2014లో 445 అంగన్వాడీ కేంద్రాలకు టాయిలెట్ సౌకర్యం ఉండగా ప్రస్తుతం 1283 కేంద్రాల్లో ప్రభుత్వం టాయిలెట్లు నిర్మించింది. జిల్లాలోని గతంలో అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సరఫరా తక్కువగా ఉండేది కాగా ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా 1504 కేంద్రాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. ఉమ్మడిపాలనలో అంగన్వాడీ కేంద్రాల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేసేవారు. కేసీఆర్ అధికారం చేపట్టాక 1504 పంచాయతీలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు.
జిల్లాలో గతంలో మోడల్ అంగన్వాడీలు 25 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 126కు పెరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో జిల్లాలోని గర్భిణులు 12,258, బాలింతలు 11,730 మందికి పౌష్టికాహారం అందజేస్తున్నారు. ప్రతిరోజూ పప్పు, ఆకుకూరలు, గుడ్లు, పాలతో సంపూర్ణ భోజనం అందిస్తుండడంతో 10శాతం రక్తహీనత సమస్య తగ్గటంతోపాటు మాతృమరణాల సంఖ్య జిల్లాలో తగ్గింది. 2014లో పిల్లల్లో పౌష్టికాహార లోపం 22.6 శాతం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 0-6 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. బాలామృతం, బాలామృతం ప్లస్ పేరిట ప్రభుత్వం పిల్లలకు పోషకాహారం అందజేయటం జరుగుతుంది. దీంతో పిల్లల్లో పోషకాహార లోపం 0.4 శాతానికి చేరుకుంది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్తో అనాథ బాలల సంరక్షణకు ప్రభుత్వం జిల్లాలో చర్యలు తీసుకుంటుంది. సంగారెడ్డి, నారాయణఖేడ్లలో రెండు బాలసదనాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో ప్రస్తుతం 70మంది పిల్లలు ఉన్నారు. సంగారెడ్డిలో ప్రభుత్వం శిశుగృహాను నిర్వహిస్తోంది. ఇందులో ప్రస్తుతం 14మంది పిల్లలు ఉన్నారు. బాలరక్షక్ హెల్ప్లైన్తో సమస్యల్లో ఉన్న పిల్లలను ప్రభుత్వం కాపాడుతుంది.
ఆరోగ్యలక్ష్మితో మహిళలు, శిశు పోషణ
తెలంగాణ ఆవిర్భవానికి ముందు సంగారెడ్డి జిల్లాలో ఒక్కపూట భోజన పథకం 56శాతం అంగన్వాడీల్లో మాత్రమే అమలు చేసేవారు. ఈ అంగన్వాడీల్లో నెల రోజుల్లో 20రోజులు మాత్రమే పాలు, గుడ్లు పంపిణీ చేసేవారు. కానీ తెలంగాణ వచ్చాక మహిళలు, శిశువులు సంపూర్ణ ఆరోగ్యంగా, రక్తహీనత నివారణ కోసం సీఎం కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. 2015 జనవరిలో ప్రారంభమైన ఆరోగ్యలక్ష్మి పథకంలో సంగారెడ్డి జిల్లాలోని 1504 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 30 రోజులపాటు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు రోజుకు ఒకటిచొప్పున 30 రోజులు గడ్లు, రోజుకు 200 ఎంఎల్ పాలు ఇస్తున్నారు. ప్రతిఏటా జిల్లాలో 1,12,540 మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తుంది. ఇందుకోసం రూ.18,79,14,375 కోట్ల నిధులు ఖర్చు చేస్తోంది. ఆరోగ్యలక్ష్మి పథకంలో హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించి వారికి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అందజేయటంతోపాటు రక్తహీనత నివారణ మందులు, టీకాలు, కాల్షియమ్ ట్యాబ్లెట్లను అందజేస్తుంది. సాధారణ ప్రసవం జరిగేలా వారిని సంసిద్ధం చేస్తూ అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇదిలాఉంటే ప్రభుత్వం మహిళల కోసం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బతుకమ్మ పండుగ సందర్భంగా పేద మహిళలకు ప్రభుత్వం ఉచితంగా బతుకమ్మ చీరలను అందజేస్తుంది.
నేడు మహిళా సంక్షేమ దినోత్సవం సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 12: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 13న మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్స్లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ శరత్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
మెదక్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): దేశం సంపూ ర్ణమైన అభివృద్ధి సాధించాలంటే అన్ని రంగాల్లోనూ మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం లభించాలి. మహిళాభ్యుదయంపై నిబద్ధత కలిగిన తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా మహిళల సంక్షేమం, ఆర్థికంగా అభివృద్ధి సాధించేం దుకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పిస్తూ అందలం ఎక్కిస్తోంది.
ఆరోగ్యలక్ష్మి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గర్భిణులు, బాలింతలకు ఒకపూట భోజన పథకం 56 శాతం అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రమే అమలు చేస్తుండేవారు. ఈ అంగన్వాడీ కేంద్రాలు నెలలో 20 రోజులు మాత్రమే పాలు, గుడ్లను పంపిణీ చేసేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత నివారణకు గానూ 2015 జనవరి 1వ తేదీన ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలుచేయడానికి ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా నూటికి నూరుశాతం అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తోంది. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మాతృమరణాలు, శిశుమరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. కరోనా సమయంలో కూడా ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణులు, బాలింతలకు 7 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు టీహెచ్ఆర్ ద్వారా అంగన్వాడీ టీచర్ ఇంటికే పంపించారు. మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది.
బాలామృతం ప్లస్…
ఐదేండ్లలోపు పేదపిల్లలకు పోషకాహార లోపం ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వీరి కోసం మంచి బలవర్థకమైన ఆహారాన్ని బాలామృతం ప్లస్ను అందిస్తుంది.. దీంతో అనతికాలంలోనే పిల్లలు పోషకాహార లోపాన్ని అధిగమించారు. ఈ పథకంలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 6,328 మంది గర్భిణులకు, 6,194మంది బాలింతలకు, 6,064 మంది 7 నెలల నుంచి ఒక సంవత్సరంలోపు పిల్లలకు, 22,453 మంది ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు గల చిన్నారులకు, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు గల పిల్లలు 23,870 మందికి ఒకపూట సంపూర్ణ భోజనాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
మెదక్ నియోజకవర్గంలో…
మెదక్ నియోజకవర్గంలో ఆరోగ్యలక్ష్మి పథకం కింద 396 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని పిల్లలు, గర్భిణులు, బాలింతలకు వివిధ రకాల పోషణ, ఆరోగ్యసేవలను అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు పోషకవిలువలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనం, గుడ్లు, పాలు అందిస్తున్నారు. 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఒక్కపూట సంపూర్ణ భోజనంతోపాటు గుడ్డు, మురుకులు అందిస్తుండగా, 7 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు అందిస్తున్నారు. ఏటా పోషణమాసంలో సామూహిక సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు. పోషకాహార వారోత్సవాలను ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, మార్చి నెలల్లో నిర్వహిస్తారు.
అంగన్వాడీ సిబ్బందికి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంగన్వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, ఆయాలకు రూ.2,200 మాత్రమే వేతనం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, అంగన్వాడీ ఆయాలకు రూ.7,800 జీతాలు పెంచి అన్ని రాష్ర్టాల కంటే ఎక్కువ జీతాలు రాష్ర్టంలో ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. అంగన్వాడీ కార్యకర్తను అంగన్వాడీ టీచర్గా గౌరవప్రదమైన స్థాయికి చేర్చడం జరిగింది. మెదక్ జిల్లాలో ఉన్న 19మంది అంగన్వాడీ టీచర్లను గ్రేడ్-2 సూపర్వైజర్లుగా క్రమబద్ధీకరించారు.
అంగన్వాడీ సిబ్బంది తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత
అంగన్వాడీ టీచర్ రూ.4,200 (నెలకు) రూ.13,650
అంగన్వాడీ హెల్పర్ రూ.2,200 రూ.7,800
మినీ అంగన్వాడీ టీచర్ రూ.2,200 రూ.7,800