రామచంద్రాపురం, ఏప్రిల్ 6: తెలంగాణ రైసింగ్ 2045 లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇక్రిశాట్లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఇక్రిశాట్ సంయుక్తంగా కొడంగల్ నియోజకవర్గ రైతులకు సాయిల్ హెల్త్ వలంటీర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన ప్రతి గ్రామం నుంచి ఒక్కో రైతును ఎంపిక చేసి సాయిల్ హెల్త్ వలంటీర్లుగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంతో పాటు లాభసాటి పంటలు, పంటల విలువ, వృద్ధి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రైతులు బయో ఫర్టిలైజర్లు, సేంద్రియ ఎరువులు వినియోగించడం ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ జానయ్య, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి, హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్బాషా, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ జనరల్ స్టాన్ఫోర్డ్ బ్లాడే, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, సంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్, వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.