డిసెంబర్ 26 : ప్రజల మన్ననలు పొందేలా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రజాపాలనపై ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన మొదటి కార్యక్రమం ప్రజాపాలన అని, ప్రజలందరూ ఆనందంగా పాల్గొని ప్రభుత్వ గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులను అందజేయుటకు అవసరమైన వసతులను కల్పించాలన్నారు. మండలం, మున్సిపల్ స్థాయిల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఎంపీడీవో, తహసీల్దార్, పంచాయతీ కార్యాలయాల్లో ప్రజా పాలన కార్యక్రమం షెడ్యూల్ను ప్రదర్శించాలని, ఒకరోజు ముందే దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తుతో పాటు ఫుడ్ సెక్యూరిటీ, ఆధార్ కార్డు ను జతపరచాలని సూచించారు.
ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్, మహిళలకు ప్రత్యేకంగా కౌంటర్లు, ఇతర దరఖాస్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రోజువారి దరఖాస్తు వివరాలను జిల్లా అధికారులకు అందించాలన్నా రు. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ మోడల్ సూల్ను నిర్మించేందుకు పది ఎకరాల స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురే ఖ బుధవారం మధ్యాహ్నం ప్రజాపాలన కార్యక్ర మం నిర్వహణపై సంగారెడ్డిలో నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో నాగరాజమ్మ, పీడీ డీఆర్డీఏ జయదేవ్ ఆర్య, డీపీఓ దేవకీదేవి, జడ్పీ సీఈఓ రమేశ్, ఆర్డీవోలు రమేశ్, బన్సీలాల్, బెన్ శాలెం తదితరులు పాల్గొన్నారు.