కనుమరుగవుతున్న పాత పంటలను రక్షించి భావితరాలకు అందించాలనే ఒక మంచి ఆశయమే కాకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడాలనే బాధ్యతతో సంగారెడ్డి జిల్లాలోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ విశేషంగా కృషిచేస్తున్నది. దీంట్లో భాగంగా ఏటా పాత పంటల పండుగ, జాతర నిర్వహిస్తున్నది. 23వ పాత పంటల జాతరను శనివారం (నేడు) మొగుడంపల్లి మండలం జాంగాన్బోడి తండాలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ జాతరలో శాస్త్రవేత్తలు, మేధావులు, రైతులు పాల్గొంటారు. జాతరలో పాత విత్తనాలతో అలంకరించిన ఎడ్లబండ్లు, తదితర ప్రదర్శనలు ఉంటాయి.
జహీరాబాద్, జనవరి 13: చిరుధాన్యాల పండుగ వచ్చేసింది. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చిరుధాన్యాల పంటలను సాగు చేయాలని అవగాహన కల్పిస్తూ డీడీఎస్ ఆధ్వర్యంలో పాత పంటల జాతర నిర్వహిస్తున్నారు. ‘జీవవైవిధ్య ఉత్సవం’ ప్రారంభానికి మొగుడంపల్లి మండలంలోని జాంగార్బోడి తండా వేదిక కానున్నది. ఈ వేడుకల్లో పాత విత్తనాలతో అలంకరించిన ఎడ్ల బండ్లు సందడి చేయనున్నాయి. పాత పంటల జాతరకు సంబంధించి శుక్రవారం డీడీఎస్ డైరెక్టర్ పీవీ సతీశ్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాల పంటలను సాగు చేసి భారతదేశం జీవవైవిధ్య తత్వాలను, సంస్కృతిని ప్రజానీకం దగ్గరకు ఓ పండుగ రూపంతో తీసుకువెళ్లేందుకే పాత పంటల పండుగ నిర్వహిస్తున్నామన్నారు.
23వ పాత పంటల జాతరను శనివారం మొగుడంపల్లి మండలంలోని జాంగాన్బోడి తండాలో ప్రారంభిస్తామని, డీడీఎస్ మహిళలు నిరంతరంగా 23 ఏండ్లుగా నడిపిస్తున్నారన్నారు. ఈ ఉత్సవాల్లో శాస్త్రవేత్తలు, మేధావులను అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, రైతు విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం రెండింటినీ ఒక కొత్త కలయికగా తీసుకరానున్నామని పేర్కొన్నారు. జీవవైవిధ్య యూనివర్సిటీలు, అకడమిక్ సంస్థలు, ల్యాబరేటరీలకే పరిమితం చేయకుండా రైతు వేదికలు, రైతుల పొలంలో ఇంటి వద్ద చర్చించినట్లు ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ జీవవైవిధ్య ఉత్సవాలకు హైదరాబాద్లోని ఐఐఎంఆర్ సైంటిస్ట్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సంజనారెడ్డి, డాక్టర్ రాజిబ్ పాటిల్, ఎంబీబీఎస్ ఎండీ ఇంటర్నల్ మెడిసన్, జనరల్ ఫిజీషియన్ అపోలో దవాఖాన హైదరాబాద్కు చెందిన వారు హాజరు కానున్నారని తెలిపారు.
జహీరాబాద్ డీడీఎస్ కార్యాలయంలో భోగి సంబురాలు..
భోగి సంబురాలు..
జహీరాబాద్ మండల పరిధిలోని పస్తాపూర్లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం భోగి మంటలు వేసి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు ముగ్గులు వేసి అందంగా అలంకరించారు. డీడీఎస్ కార్యాలయంలో నిర్వహించిన భోగి పండుగలో డీడీఎస్ డైరెక్టర్ పి.వీ.సతీశ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
పాత పంటల జాతర రూట్ మ్యాప్