అమీన్పూర్, జూన్ 7 : నిబంధనలకు విరుద్ధ్దంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. భారీగా నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అమీన్పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్గూడ గ్రామాల్లోని పలు కాలనీల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా యి. అనుమతులకు మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు.
సెల్లార్కు అనుమతులు లేకున్నా నిర్మిస్తున్నారు. తాజాగా పలు కాలనీల్లో జీ ప్లస్ టూ అనుమతులను మించి అదనపు అంతస్తులు, పెంట్హౌస్లు కడుతున్నా రు. కిష్టారెడ్డిపేట, పటేల్గూడ గ్రామాల పరిధిలో సుమారు వందకు పైగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసినా ఇటువైపు కన్నె త్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏడాదిగా భారీ భవన నిర్మాణాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులకు మించి అదనపు అంతస్తులు నిర్మించేందుకు అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి పడుతుం ది.
జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నామని చెబుతున్నా, నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతుండడంతో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను నివారించాల్సిన అధికారులు యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాలు ఒక్కరోజులో ఏర్పడినవు కావు. అధికారుల పర్యవేక్షణా లోపం, నిర్లక్ష్యంతో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్, జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.