బెజ్జంకి, ఆగస్టు 29: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. మంత్రి తన్నీరు హరీశ్రావు స్వగ్రామం కావడంతోపాటు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మంత్రి ప్రత్యేక కృషి స్థానిక ప్రజాప్రతినిధుల పట్టుదలతో గ్రామం అభివృద్ధిలో ముందంజలో ఉన్నది. గ్రామంలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులతోపాటు గ్రామ చెరువును మంత్రి హరీశ్రావు ఆన్లైన్ రిజర్వాయర్గా తీర్చిదిద్దడంతో 365 రోజులు నీరు ఉంటున్నది. దీంతో పూర్వవైభవం సంతరించుకొని పాడిపంటలతో ఆ గ్రామం సస్యశ్యామలమై విరాజిల్లుతున్నది. గ్రామంలో ఎటు చూసినా పచ్చని పంటలతో కలకలలాడుతున్నది. రిజర్వాయర్ నిర్మాణంతో గ్రామం కరువు రహిత ప్రాంతంగా రూ పాంతరం చెందింది. మంత్రితోపాటు రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ బానుప్రకాశ్లకు ఈ గ్రామంతో అనుబంధం ఉండటం, అందరి సమష్టి కృషి ఫలితంగా గ్రామం మరింత అభివృద్ధి చెందింది. ఒకప్పుడు కరువుతో అల్లాడే ప్రాంతాం రిజర్వాయర్తో పుష్కలంగా పంటలు పండి రైతులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.
గ్రామాభివృద్ధికి మంత్రి హరీశ్రావు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మంత్రికి సొంత ఊరిపై మమకారం ఉన్నది. గ్రామంలోని సొంత ఇంటి స్థలాన్ని మంత్రి హరీశ్రావు గ్రంథాలయం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు అందించి గ్రామంపై మమకారం చాటుకున్నారు. గ్రామంలో సొంత నిధులతో రామాలయం, చెన్నకేశ్వరస్వామి దేవాలయాలను సొంతంగా నిర్మించి ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దారు.గ్రామంలోని ప్రజలకు ఏ చిన్న ఆపద వచ్చినా మంత్రి ప్రజలకు వెన్నంటి అండగా ఉంటూగ్రామాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు.
గ్రామంలోని ప్రధాన రోడ్డు ఇరుకుగా మారడంతో మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో రూ.5 కోట్లతో డబుల్ రోడ్డుగా మార్చారు. దీంతో ప్రయాణికులు, గ్రామస్తులకు రవాణా మార్గం సులువుగా మారింది. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా మంత్రి ఇటీవల గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన నేపథ్యంలో కేంద్రాన్ని పరిశీలించి, దవాఖాన నిర్మాణానికి రూ.1.51 కోట్లు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయి. గ్రామంలో కోటి రూపాయలతో 2500 మీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకోగా రూ.33లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మించారు. రూ.15 లక్షలతో అంగన్వాడీ భవనం నిర్మించగా ప్రహరీ నిర్మించాల్సి ఉంది. రూ.18 లక్షలతో మహిళా సమాఖ్య భవనం నిర్మించగా ప్రహరీ నిర్మించాల్సి ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునీకంగా రూ.38 లక్షలతో గ్రంథాలయ నిర్మాణం చేపట్టారు. రూ.12. లక్షలతో ముదిరాజ్, రూ.12 లక్షలతో రజక, రూ. 12 లక్షలతో గౌడ సంఘం కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయి.
రూ.25 లక్షలతో అంబేద్కర్ సమూహిక భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. రూ.2.96 లక్షలతో పాఠశాలలో స్టేజీ నిర్మించారు, సుమారు రూ.2 కోట్లతో సబ్ మార్కెట్యార్డు నిర్మించి రైతుల కష్టాలు తీర్చారు. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా గ్రామానికి 30 ఇండ్లు కేటాయించి లబ్ధిదారులకు అందించారు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. రూ. 5 లక్షలు మం జూరు కాగా పల్లె ప్రకృతి వనం పూర్తికావల్సి ఉంది , రూ. 12 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు నిర్మించారు. హరితహారంలో భాగంగా గ్రామం లో ఇప్పటి వరకు రూ. 10 వేల మొక్కలు నాటారు. గ్రామంలో యువత కోసం క్రీడామైదానం ఏర్పాటు చేశారు. రిజర్వాయర్పై రూ.10 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రూ. 30 లక్షలతో కేసీఆర్ ఫంక్షన్హాల్ నిర్మించనున్నారు. రిజర్వాయర్ సమీపంలో ఆధునిక హంగులతో చేపలు విక్రయించేలా రూ. 25 లక్షలతో చేపల మార్కెట్ ఏర్పాటు చేయనున్నారు. రాజీవ్హ్రదారికి పక్కన తోటపల్లి రిజర్వాయర్ ఉండటంతో దాన్ని పర్యాటక ప్రాంతంతోపాటు, గెస్ట్ హౌస్,పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రణాకలు రూపొందిస్తున్నారు.
నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు ధన్యవాదాలు. వారి సహకారంతో గ్రామంలో చాలా అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం.
– బోయినిపల్లి నర్సింగరావు, సర్పంచ్, తోటపల్లి, బెజ్జంకి మండలం
గ్రామంలో వివిధ రకాల 457 పింఛన్లు ఉండగా నెలకు ప్రభుత్వం రూ.957312 అందిస్తున్నది. 50 మందికి కల్యాణ లక్ష్మి, 200 మందికి సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ప్రభుత్వం అందించి అండగా నిలించింది. 1000 ఇండ్లకు మిషన్భగీరథ ద్వారా తాగు నీరు, రిజర్వాయర్ ద్వారా 3000 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. 1092 మంది రైతులకు ప్రభుత్వం రైతు బంధు ఇవ్వగా, 15 మంది రైతులకు రైతు బీమా ఇచ్చి ఆదుకున్నది.