తాను అబల కాదు.. సబల, సాహసి అని నిరూపిస్తున్నది మహిళ. కష్టాలను భరిస్తూ, వేధింపులను ధైర్యంగా ఎదుర్కొంటున్నది. కన్నీళ్లు పెట్టుకోవడం కాదు… అవసరమైతే కన్నెర్రజేస్తున్నది. పిరికితనం వదిలి పిడికిలి బిగిస్తున్నది. నేలవైపు తలవాల్చి నడవడం కాదు, నింగికి నిచ్చెన వేస్తున్నది. ఆకాశంలో సగమై, అవనిలో అర్ధభాగమై నడుస్తున్నది. పురుషులకు దీటుగా అన్నిరంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. జగతిలో తాను లేని చోటు లేదని రుజువు చేస్తున్నారు. -అక్కన్నపేట, మార్చి 7
ఇంట్లో అదనపు వరకట్నం కోసం హింసించే భర్త… పాఠశాల, కళాశాలలో ప్రేమ పేరిట విసిగించే పోకిరీలు… అదును చూసి కాటేసే కామాంధులు.. పనిచేసే చోట మానసికంగా వేధింపులు… ఇలా అడుగుకో మగాడు. మహిళ రక్త మాంసాలు నుంజుకుతినే మృగాడు. మరి ఈ అకృత్యాలకు అంతం లేదా? మగువకు రక్షణ లేదా? అంటే రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు, ఐపీసీలో మరెన్నో సెక్షన్లు ఉన్నాయి. వాటి గురించి అవగాహన లేకపోవడమే మహిళల పాలిట శాపంగా మారింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
వరకట్న నిషేధ చట్టం-1961
భర్త, అతని తల్లిదండ్రులు, అడపడుచులు, అత్తింటి తరపున ఇతర బంధువులు ఎవరైనా వరకట్నం కోసం వేధిస్తే ఐదేండ్లకు పైగా జైలు, రూ.15 వేలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. ఈ చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరమే. వరకట్న వేధింపులకు సంబంధించి మహిళలు నేరుగా సంబంధింత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసులపై మొదటి శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తుంది.
ర్యాంగింగ్ నిరోధక చట్టం-1997
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ర్యాగింగ్ను నిషేధిస్తూ ప్రభుత్వం 1997లో ర్యాగింగ్ నిరోధక చట్టం నంబర్ 28ను తెచ్చింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. 1800 18022 18055 నంబర్లకు విద్యార్థినులు ఫోన్చేసి సమస్యలను చెప్పవచ్చు. ర్యాగింగ్ వ్యవస్థ నిర్మూలనకు కళాశాలల్లో కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ర్యాగింగ్కు పాల్పడినట్లు రుజువైతే ఆరు నెలల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్షతోపాటు కఠిన చర్యలు తీసుకుంటారు.