సిద్దిపేట, డిసెంబర్ 10: కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల తిరుపతి వేంకటేశుడు సిద్దిపేటలో కొలువుదీరనున్నాడని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం తిరుమల వెళ్లిన హరీశ్రావు నూతన చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. సిద్దిపేట కోమటిచెరువు ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేంకటేశ్వరాలయాన్ని నిర్మించాలని కోరారు. ఆలయ నిర్మాణం కోసం ఐదెకరాల 10గుంటల స్థలాన్ని మంజూరు చేశామన్నారు. గతంలోనే టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు, స్థపతి పర్యటించి స్థలాన్ని పరిశీలించి, దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణ నమూనా, డిజైన్స్ రూపొందించారని చైర్మన్కు వివరించారు.
వేంకటేశ్వర స్వామిని ప్రజలు ఇష్ట దైవంగా.. ఇలవేల్పుగా కొలుస్తారని, అలాంటి ఆలయం సిద్దిపేటలో నిర్మించడం గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. వచ్చే బోర్డు మీటింగ్లో సిద్దిపేటలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపి, ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కోరారు. అందుకు చైర్మన్ బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించి చీఫ్ ఇంజినీర్ అధికారి, సంబంధిత అధికారులను పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.