సిద్దిపేట/గజ్వేల్, ఫిబ్రవరి 24: ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెల్లించే పాల బిల్లులు చెల్లించడంతో జాప్యం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో సమయానికి వచ్చిన బిల్లులు ప్రస్తుతం రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయ పాలడెయిరీని గత ప్రభుత్వం బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది. దాంతో పాటు రైతులకు అదనంగా లీటర్కు రూ.నాలుగు రూపాయలు చెల్లించడంతో ఎంతో ఉత్సాహంగా పాల ఉత్పత్తిపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటై రెండు నెలలు గడుస్తున్నా రైతుల నుంచి సేకరించిన పాలకు సకాలంలో బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో పాలను ప్రైవేట్ డెయిరీలకు విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో రోజూ 30వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. 350 పాల సేకరణ కేంద్రాలు, 16 మినీ సేకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ 7200 మంది రైతుల నుంచి విజయ డెయిరీ పాలను సేకరిస్తుంది. సిద్దిపేట విజయ డెయిరీ ఆధ్వర్యంలో సేకరించిన పాలకు చెల్లించాల్సిన బకాయిలు మూడు కోట్ల 55 లక్షలు పెండింగ్లో ఉన్నాయి.
గజ్వేల్ విజయపాల డెయిరీ పరిధిలో అహ్మదీపూర్, మక్కరాజ్పేట, చాట్లపల్లి, కొమురవెల్లి, యాదాద్రి జిల్లా నుంచి కొన్ని గ్రామాల్లోని ఐదు రూట్లలో ప్రతి రోజూ సుమారు 1000 మంది రైతుల నుంచి 3200 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. రైతులు పోసిన పాల నుంచి వచ్చే ప్యాట్కు అనుగుణంగా ధర నిర్ణయించి చెల్లిస్తున్నారు. దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రతి లీటర్కు నాలుగు రూపాయలు రైతులకు చెల్లించే విధంగా చూశారు. నవంబర్ వరకు నాలుగు వేల లీటర్ల వరకు పాలు సేకరించగా ప్రస్తుతం 3200 లీటర్ల వరకే ఐదు రూట్ల నుంచి పాలను సేకరిస్తున్నారు. పదిహేను రోజులకు ఒకసారి రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో పాలు పోసేందుకు రైతులు ఆసక్తి చూపించడం లేదని గ్రామాల్లోని పాలు సేకరిస్తున్న నిర్వాహకులు చెబుతున్నారు. గజ్వేల్ పరిధిలోని ఐదు రూట్లలో రెండు విడతలకు సంబంధించి సుమారు రూ.45లక్షల వరకు రైతులకు చెల్లించాల్సిన డబ్బులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ములుగులో ఐకేపీ ద్వారా విజయపాల డెయిరీని నడిపిస్తున్నారు. ఈ కేంద్రానికి వర్గల్, కర్కపట్ల, మర్కూక్ రూట్ల నుంచి పాలు సేకరిస్తున్నారు. ఈ కేంద్రానికి అధికంగా ఆవుపాల సేకరణ జరుగుతున్నది. సుమారు 16వందల మంది రైతుల నుంచి రోజూ 2800 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. ఇక్కడ మూడు బిల్లులు పెండింగ్లో ఉండగా రెండు రోజుల క్రితమే ఒక విడత బిల్లు రైతులకు చెల్లించారు. మరో రెండు బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ కేంద్రానికి సంబంధించి సుమారు రూ.35 లక్షల వరకు రైతులకు రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సకాలంలో పాల బిల్లులు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సమయానికి వచ్చిన బిల్లులు నేడు రావడం లేదు. దీంతో విజయ డెయిరీకి రైతులు పాలు పోసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో పాల సేకరణ తగ్గే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని సంవత్సరాలుగా పాడి పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నా. రోజూ 25 లీటర్ల పాలు విజయ డెయిరీకి అందజేస్తున్నా. క్రమం తప్పకుండా బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే రెండు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు రెగ్యులర్గా రాకపోవడంతో పశువులకు అవసరమైన దాణా, ఇతర అవసరాలకు పెట్టుబడి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంటనే బిల్లులు చెల్లించాలి.
రైతులకు రెండు బిల్లులు పెండింగ్లో ఉన్న విషయం వాస్తవమే. సుమారు మూడు కోట్ల యాభై ఐదు లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.ఈ విషయంపై పాడి సమైఖ్యకు విన్నవించాం. త్వరలోనే బిల్లులు రైతులకు అందేలా కృషి చేస్తున్నాం.