జిన్నారం, మార్చి 26 : పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతాలు నిషేధిత మత్తుమందుల తయారీకి అడ్డాలుగా మారుతున్నాయి. ఇక్కడ తయారు చేసి దేశ, విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఇటీవల పట్టుబడిన ఘటనలు నిజం చేశాయి. రాత్రికిరాత్రే కోటీశ్వరులు కావాలన్న దురాశతో ప్రభుత్వం నిషేధించిన మత్తు మందులను తయారు చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కువగా మూతబడిన పరిశ్రమలు, సిక్ పరిశ్రమలను ఎంచుకుంటున్నారు. ఇలాంటి పరిశ్రమలపై ఎవరి దృష్టి ఉండకపోవడంతో డ్రగ్స్ తయారీకి సిద్ధపడుతున్నారు. పైగా ఇందులో ఎలాంటి ఉత్పత్తులు చేస్తున్నారో కూడా రసాయన నిపుణులకు, సంబంధిత శాఖ అధికారులకు తప్ప సామాన్య జనాలకు, పనిచేసే కార్మికులకు తెలియదు. ఇదే డ్రగ్స్ తయారీదారులకు కలిసివస్తున్న అంశం. పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో డ్రగ్స్ తయారీ చేస్తూ పట్టుబడిన ఘటనలు ఉన్నాయి.
మూతబడిన పరిశ్రమలు, సిక్ ఇండస్ట్రిస్ డ్రగ్స్ తయారీకి అడ్డాగా మారాయి. వీటికి రోడ్లు సరిగ్గా ఉండవు. భయంకరమైన వాతావరణంలో పరిశ్రమలు ఉంటాయి. ఇప్పటివరకు అధికారుల దాడులు చేసిన పరిశ్రమలన్నీ మూతబడిన, సిక్ పరిశ్రమలే. గతంలో పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో ఇలాంటి సిక్, మూతబడిన పరిశ్రమల్లో నిషేధిత డ్రగ్స్ను తయారు చేయగా అధికారులు దాడులు చేశారు. అక్రమంగా మత్తు మందులు తయారు చేస్తున్న పరిశ్రమలకు ఎలాంటి పేరు, వివరాలు ఉండడం లేదు. సంవత్సరకాలంలో అధికారులు దాడులు చేసిన ఆరు పరిశ్రమల్లో మూడు పరిశ్రమలకు బోర్డు లేదు, పేరు, వివరాలు లేవు.
డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడిన వారంతా గతంలో రసాయన పరిశ్రమల్లో పనులు చేసిన వారే. డ్రగ్స్ తయారు చేస్తున్న వారికి స్థానికంగా కొందరి నుంచి సహకారం లభిస్తోంది. ఎలాంటి సహకారం లేకుంటే రాష్ట్రస్థాయిలో కుదిపేసే ఇలాంటి డ్రగ్స్ తయారీకి ఎవరు సాహసం చేయరని నిఫుణులు అంటున్నారు. బొల్లారంలో 2016 సెప్టెంబర్లో జరిగిన డ్రగ్స్ తయారీలో దొరికిన వారు ఇంతకుముందు ఓ పరిశ్రమలో కెమిస్ట్గా పని చేసన వ్యక్తే. అలాగే 2017లో బొల్లారంలో అధికారులు దాడులు చేసి పట్టుకున్న డ్రగ్స్ తయారీలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గతంలో గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో కెమిస్ట్గా పనిచేసిన వ్యక్తి. వివిధ పరిశ్రమల్లో కెమిస్ట్గా పనిచేసిన వారు డబ్బుమీద అధిక వ్యామోహంతో రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలన్న దురాశతో ప్రభుత్వం నిషేధించిన డ్రగ్స్ను తయారు చేస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు. ఇందుకోసం మూసిఉన్న పరిశ్రమలను లీజుకు తీసుకుంటున్నారు. యాజమానులకు ఒకటి చెప్పి ఉత్పత్తులు మరొకటి చేస్తున్నారు.
పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తూ తెలంగాణ యాంటీ నార్కోటిక్ టీమ్, స్థానిక పోలీసులకు పట్టుబడిన ఘనలు అనేకం ఉన్నాయి. 2016 అక్టోబర్ 4న ఐడీఏబొల్లారం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో నిషేధిత డ్రగ్స్ను తయారు చేసి తరలిస్తుండగా సెంట్రల్ టాస్క్ఫోర్స్ అధికారులు బెంగళూరులో దాడిచేసి పట్టుకున్నారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది. అధికారులు దాడుల్లో పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ.42కోట్లు. అదే సంవత్సరం డిసెంబర్ 7న పటాన్చెరు మండలం గండిగూడెం సమీపంలోని వార్వే పరిశ్రమలో అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు తెలుసుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 149 కిలోల ఆల్ఫోజోమ్ను స్వాదీనం చేసుకున్నారు. దాని విలువ మార్కెట్లో రూ.80లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 23న గుమ్మడిదల మండలంలోని అనంతారం గ్రామ శివారులోని వెంకటరాఘవ ల్యాబ్ పరిశ్రమలో నిషేధిత ఆల్ఫోజోమ్ మత్తు మందును తయారు చేస్తుండగా రెవెన్యూ నిఘావిభాగం దాడులు చేసి 132 కిలోల మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ.3కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ఐడీఏబొల్లారంలోని ఓ సిక్ ఇండస్ట్రిస్లో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తుండగా రెవెన్యూ నిఘావిభాగం అధికారులు దాడులు చేసి 179 కిలోల మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5కోట్లకు పైగానే ఉంటుంది. గతంలో గడ్డపోతారం పారిశ్రామివాడలో ట్రెకడాల్ అనే మత్తు పదార్థాన్ని తయారు చేసి పాకిస్తాన్కు పంపించే క్రమంలో యాంటీ నార్కోటిక్ టీమ్ గుర్తించి పట్టుకున్నారు. 2023 డిసెంబర్లో కొడకంచి శివారులోని జామతోటలో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తుండగా 14 కిలోల నార్డాజెపం అనే మత్తు మందును అధికారులు పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.3కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈనెల 21న ఐడీఏబొల్లారం పారిశ్రామిక వాడలోని పీఎస్ఎన్ మెడికేర్ పరిశ్రమలో 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ను అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. దీని విలువ రూ.9కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన మరువకముందే ఈనెల 23న ఐడీఏబొల్లారంలోని మెడికేమ్ పరిశ్రమలో 2.84కిలోల ఎంఎంసీ(మిథైల్ మెథ్ కాతినోస్) అనే డ్రగ్ను అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.10లక్షలు. ఇవి కేవలం బయటపడినవి మాత్రమే.