కంది, మార్చి 10: ప్రభుత్వం చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమ పనులు భేష్ అని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ కితాబిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని కంది ప్రైమరీ పాఠశాల, ఎద్దుమైలారం జడ్పీహెచ్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎల్ఎన్ బోధన, మనఊరు-మనబడి అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో పాఠశాలను రోల్ మోడల్గా ఉంచినందుకు డీఈవో, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. పాఠశాలలో జరిగే వినూత్న కార్యక్రమాలు రాష్ట్రస్థాయికి ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ మాట్లాడుతూ పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించి రాష్ర్టానికే పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఆమెవెంట అడిషనల్ జాయింట్ డైరెక్టర్ రమేశ్, సంగారెడ్డి విద్యాధికారి నాంపల్లి రాజేశ్, సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటేశం, ఎంఈవో నర్సింలు, ఉపాధ్యాయులు తదితరులున్నారు.