సిద్దిపేట, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట-హుస్నాబాద్-ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ) విస్తరణ పనులు నత్తనడక కొనసాగుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డును ఒకేసారి మొత్తం తవ్వి పనులు చేపడుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిచోట్ల ఒక మార్గం పూర్తయ్యాక రెండో మార్గంలో రోడ్డును తవ్వారు. మరికొన్ని చోట్ల రెండువైపులా ఒకేసారి రోడ్డును తవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిట్టపల్లి నుంచి రాజగోపాల్పేట వరకు మొత్తం రోడ్డును తవ్వేశారు. పాలమాకుల దాటిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం 9 నెలలుగా చేస్తున్నా పూర్తి కాలేదు. చాలాచోట్ల నెలల తరబడి కల్వర్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వర్ష్షాకాలం వచ్చేలోగా కల్వర్టుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కొన్నిచోట్ల సైడ్ డ్రైన్లు నిర్మిస్తున్న చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. వాహనాలు ఎదురెదురుగా వచ్చిన సమయంలో చిన్నచిన్న కంకర రాళ్లు ఎగిరి పడుతున్నాయి. ఇటీవల కంకర రాయి ఎగిరి వచ్చి ఓ ప్రయాణికుడికి తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. దుమ్ము విపరీతంగా లేస్తుండడంతో ప్రయాణికులు అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటుడడంతో పాటు ప్రమాదాలకు గురవుతున్నారు. సరిగ్గా వాటర్ క్యూరింగ్ చేయడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దుమ్ముతో వాహనాలు వెళ్లినప్పుడు ఎదురెదురుగా టూవీలర్ వంటి వాహనాలు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ) పనులు ఏడాది కిందట ప్రారంభంచారు. మెదక్-సిద్దిపేట ఒక బిట్టుగా, సిద్దిపేట- ఎల్కతుర్తి వరకు రెండో బిట్టుగా రహదారిని విభజించారు. సిద్దిపేట-ఎల్కతుర్తి 63.641 కిలోమీటర్ల రహదారికి రూ. 578.85 కోట్లు, మెదక్ నుంచి సిద్దిపేట వరకు రహదారి విప్తరణకు 70 కిలోమీటర్లకు రూ. 882 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఈ జాతీయ రహదారి 765 డీజీ 134 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఇందులో రెండు టోల్ప్లాజాలు ఏర్పాటు చేస్తారు.వీటిలో ఒకటి మెదక్ జిల్లా పోతారెడ్డిపేట నుంచి నిజాంపేట మధ్యలో, రెండోది సిద్దిపేట జిల్లా పందిల్ల వద్ద టోల్ప్లాజా ఏర్పాటు చేస్తారు. ఈ రహదారి విస్తరణతో మెదక్, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ తదితర జిల్లాలకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ రోడ్డు విస్తరణలో అడ్డంకులను కేసీఆర్ ప్రభుత్వం తొలిగించి పనుల్లో వేగం పెంచింది. ఈ రోడ్డు విస్తరణ పనులు స్పీడ్గా జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోడ్డు పనుల పురోగతిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రోడ్డు నిర్మాణంతో నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలివేశారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. డివైడర్లు, సైడ్ డ్రైన్లకు సరిగ్గా వాటర్ క్యూరింగ్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారీతిగా పనులు చేపడుతున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట రంగధాంపల్లి బ్రిడ్జి నుంచి హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వరకు బస్వాపూర్, సముద్రాల, పందిల్ల, హుస్నాబాద్, పోతారం(ఎస్) జిల్లెల గడ్డ, ముల్కనూరు, కొత్తపల్లి, ఇంద్రానగర్, ఎల్కతుర్తి గ్రామాల మీదుగా హన్మకొండ- కరీంనగర్ జాతీయ రహదారికి ఈ రోడ్డు కలుస్తుంది. ఈ రహదారి విస్తరణలో పెద్ద బ్రిడ్జిలు 2 బస్వాపూర్, పందిల్ల, మైనర్ బ్రిడ్జిలు 26, పైప్ కల్వర్టులు 29, స్లాబ్ కల్వర్టులు 29 ఏర్పాటు చేయాల్సి ఉంది. చాలాచోట్ల బ్రిడ్జిల నిర్మాణం నత్తనడక కొనసాగుతున్నది.