దుబ్బాక, మార్చి 9: బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చేందుకు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు గలగల పారుతూ దుబ్బాక గడ్డను ముద్దాడాయి. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం తుక్కాపూర్ మల్లన్నసాగర్ పంపుహౌస్ నుంచి 12వ ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి నీరు విడుదల చేయడంతో గోదావరి గంగమ్మ పరుగులు తీస్తున్నది. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో నేలతల్లిని గోదావరి జలాలు ముద్దాడుతూ పక్కనే ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో గోదావరి పరవళ్లు కనువిందు చేస్తున్నాయి. రెండేడ్లుగా యాసంగిలో కాల్వల ద్వారా గోదావరి జలాలతో దుబ్బాక నియోజకవర్గం పచ్చని పంటలతో ‘ఆకుపచ్చ తివాచీగా’ మారింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యంగా మారి నేడు కండ్లముందు జలదృశ్యం కనువిందు చేస్తున్నది. ఎక్కడో ఉన్న ‘గోదారమ్మ’ను సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా దుబ్బాకకు తీసుకొచ్చారు. ఇంతకు ముందు సాగునీటి కోసం రైతన్నలు బోరు, బావులు తవ్వించి అప్పులపాలై వాటిని తీర్చలేకఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మల్లన్న సాగర్ ద్వారా కరువు అనే పదం కనిపించకుండా శాశ్వత పరిష్కారం లభించింది. కాల్వల ద్వారా గోదావరి పరవళ్లు చూస్తుంటే నియోజకవర్గ రైతుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు జిల్లాకే కాకుండా చుట్టుపక్కల మరో పది జిల్లాల సాగు,తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపింది. ఇటీవల ఆర్థిక,వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మల్లన్నసాగర్ 12 ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి గోదావరి జలాలను విడుదల చేశారు. దీంతో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలతో పాటు పక్కనున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల పంటపొలాలకు సాగునీరు అందుతున్నది.
దుబ్బాక నేలతల్లిని ముద్దాడేందుకు గోదావరి జలాలు తరలిరావడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్నసాగర్ 12వ ప్యాకేజీ ప్రధాన కాల్వ నుంచి ప్యాకేజీ (దుబ్బాక కెనాల్) ద్వారా దుబ్బాక, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల (ముస్తాబాద్) నియోజకవర్గాల్లో చెరువు,కుంటలు జలకళ సంతరించనున్నాయి. ఇటీవల మల్లన్నసాగర్ సర్జ్జ్పూల్ నుంచి గోదావరి జలాలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విడుదల చేయడంతో దుబ్బాక నియోజకవర్గంలో గోదావరి పరుగులు పెట్టింది. సిద్దిపేట జిల్లాతో పాటు పక్కనే ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాలకు సాగునీరు అందించారు.
కాల్వల ద్వారా యాసంగి పంటలకు సాగునీరు అందించడంతో రైతులు కేసీఆర్ సర్కారుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మల్లన్నసాగర్ ప్రధాన కాల్వను 5 విభాగాలుగా చిన్న కాల్వలను విభజించి, 46 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. గొలుసుకట్టు కాల్వల ద్వారా 93 చెరువు, కుంటలు నింపడంతో పాటు 1.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. తొగుట మండలం ఎల్లారెడ్డిపేట నుంచి బంజేరుపల్లి, మెట్టు, ఘనపూర్, వెంకట్రావ్పేట గ్రామాల నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో ఇర్కోడు, తోర్నాల నుంచి దుబ్బాక మండలంలో తిమ్మాపూర్, అప్పనపల్లి, హస్మీరాపూర్, పెద్దగుండవెళ్లి, బల్వంతాపూర్, పద్మశాలి గడ్డ, చెల్లాపూర్, రాజక్కపేట గ్రామాల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట, చిప్పలపల్లి, గోపాలపూరం గ్రామాల మీదుగా చివరకు మిడ్ మానేరుకు గోదావరి నీళ్లు చేరుతున్నాయి. కాల్వల ద్వారా పరుగులు పెడుతున్న గోదావరి జలాలతో కొత్త శోభ నెలకొన్నది.
దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ నుంచి తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లో 66, 423 ఎకరాలకు సాగు నీరు అందనుంది. మరో పక్క దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట మండలాలకు కొండపోచమ్మ సాగర్ నుంచి గజ్వేల్ మీదుగా ప్రధాన కాల్వ ద్వారా మరో 60 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా మొత్తం 1.27 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. దీంతో పాటు నియోజకవర్గంలో ప్రధాన వాగు కూడవెల్ల్లి జీవనదిని తలపిస్తున్నది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యపడింది. గోదావరి జలాలతో జిల్లా సస్యశ్యామలంగా మారింది. గత సమైఖ్యాంధ్ర పాలనలో సిద్దిపేట జిల్లాలో సాగునీరు లేక బీడు భూములుగా మారాయి. మరికొందరు రైతులు బోరు బావులు తవ్వించి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన సంఘటనలు చూశాం. తెలంగాణ స్వరాష్ట్రంలో ఎన్నో సంక్షేమ ఫలాలతో పాటు దుబ్బాక నియోజకవర్గం ఆకుపచ్చ తివాచీగా మారింది.
సీఎం కేసీఆర్ నాడు (తెలంగాణ ఉద్యమ సమయంలో..) జిల్లాలోని బీడు భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని ఇచ్చిన హామీని ఆచరణలో చేసి చూపించారు. ఇందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు, కాల్వలకు భూములు ఇచ్చిన రైతుల త్యాగం మరువలేనిది. మల్లన్న సాగర్ప్రాజెక్టు జిల్లా ప్రజలకు వరంగా మారింది.
– కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
కాల్వల ద్వారా గ్రామానికి గోదావరి నీళ్లు వస్తాయని ఊహించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల మనిషి కాదు..మా పంట పొలాలకు సాగు నీరందించిన నిజమైన దేవుడు. రైతుల కోసం ఎన్నో పథకాలు తెచ్చిండు. ఆ నాయకుడికి రైతులు రుణపడి ఉంటారు. ఐదు ఎకరాలు ఉంటే.. కాల్వ ద్వారా ఎకరం కోల్పోయాను. దానికి సంబంధించి ప్రభుత్వ పరిహారం ఇచ్చింది.
ఇప్పుడు పొలం పక్క నుంచి కాల్వ ద్వారా నీళ్లను చూస్తే కడుపు నిండినట్లు ఉంది. భూమి పోయిన బాధ కంటే కాల్వల ద్వారా పంటకు నీళ్లు రావటమే ఎక్కువ సంతోషంగా ఉంది. ప్రస్తుతం గ్రామంతో పాటు చుట్టపక్కల గ్రామాలు ఆకుపచ్చగా, ఆహ్లాదకరంగా మారాయి. ఇటీవల మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మాటల్లో చెప్పలేనంత
సంతోషంగా ఉంది.
– ఎమ్మా అంజయ్య, రైతు, నర్లేన్గడ్డ (దుబ్బాక)
కాల్వలు నిర్మించకముందు యాసంగిలో భూములు బీడు ఉండేది. సీఎం కేసీఆర్ దయ వల్ల నీళ్ల గోస లేకుండా పోయింది. వానకాలం, యాసంగి పంటలకు నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. గతేడాది నుంచి గ్రామంలో సాగునీటికి ఇబ్బంది లేదు. మూడు ఎకరాల్లో పంటలు పండిస్తున్నా. కాల్వల ద్వారా నీరు రావటంతో ఎవరూ భూములు బీడు ఉంచడం లేదు. రైతుబంధు పథకం, మల్లన్న సాగర్ ద్వారా గోదావరి నీళ్లు ఇవ్వడం సీఎం కేసీఆర్కే సాధ్యపడింది.
– వెంకటయ్య, రైతు, అప్పనపల్లి (దుబ్బాక)