గజ్వేల్ : గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయాలన్న దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్వైఫెరీ శిక్షణ ఆలోచన అద్భుతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ వ్యవహారాల శాఖ నర్సింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ రతి బాలచంద్రన్ అన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఏరియా దవాఖానలో తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా స్టాఫ్ నర్సులకు నిర్వహిస్తున్న మిడ్వైవ్స్ శిక్షణ విధానాన్ని ఆమె బుధవారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆర్యోగ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ, నర్సింగ్ విభాగం డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ విద్యులత, యునిసెఫ్ వైద్యవిభాగం అధికారిణి డాక్టర్ సలీమా భాటియా, ఫెర్నాండేజ్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ రాధారెడ్డిలతో కలిసి పరిశీలించారు.
తెలంగాణ ప్రభుత్వం ద్వారా మొట్టమొదటగా మిడ్వైవ్ శిక్షణ పొందిన నర్సులు శ్రీలత, భార్గవిలు గజ్వేల్ దవాఖానలో 12మంది రెగ్యులర్ స్టాఫ్ నర్సులకు నాలుగు నెలల నుంచి శిక్షణను అడిగి తెలుసుకున్నారు. మిడ్వైవ్ల ద్వారా సేవలు పొందిన గర్భిణులు, సాధారణ ప్రసవాలు అయిన బాలింతలను అడిగి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ రతి బాలచంద్రన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ప్రసవాల పెంపునకు మిడ్వైవ్ల శిక్షణను చేపట్టాలన్న ఆలోచన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని, దాని ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు. మిడ్వైవ్ శిక్షణను దేశవ్యాప్తంగా నిర్వహించడానికి గజ్వేల్లోని దవాఖానలో శిక్షణ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించామని పేర్కొన్నారు.