చేర్యాల, ఫిబ్రవరి 1: గ్రామాల అభివృద్ధి లో సర్పంచ్ల పాత్ర మరువలేనిదని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. గురువారం చేర్యాలలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్పర్సన్ హాజ రై మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ హయాం లోనే సర్పంచ్లు అనేక పథకాలను ప్రజలకు చేరవేసి మన్ననలు పొందారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, నర్సరీలు, ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులతోపాటు మౌలిక వసతుల కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. అంతకుముందు సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను లేవనెత్తారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఆ పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించాలని సర్పంచ్లు వేడుకున్నారు. అనంతరం సర్పంచులను జడ్పీ చైర్పర్సన్ శాలువాలతో సన్మానించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, ఎంపీడీవో మహబూబ్ అలీ, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 1 : మాజీ సీఎం కేసీఆర్తోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. గురువారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను అందించడంతోపాటు డంపింగ్యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. వ్యవసాయరంగానికి కేసీఆర్ పెద్దపీట వేశారని, రైతులకు రైతుబంధు, రైతు బీమా అందించినట్లు తెలిపారు.అనంతరం సర్పంచ్లను శాలువాలతో సన్మానించి మెమోంటోలు అందజేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, తహసీల్దార్లు అనంతరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.