మెదక్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) / మెదక్ మున్సిపాలిటీ: స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధితో కూడిన సుస్థిర ప్రజాస్వామ్యాన్ని ఒక ఓటుతోనే సాధించుకోగలమని, అలాంటి ఓటరు డే ను మనందరం పండుగలా నిర్వహించుకోవడం హర్షణీయమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జనవరి 25 జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం పోస్టాఫీస్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన ఓటరు చైతన్య ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ర్యాలీ అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 2011 సంవత్సరం జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏడాది ఇదేరోజును జాతీయ ఓటరు దినోత్సవంగా జరుపుకొంటున్నామన్నారు. జిల్లాలో అర్హులైన వారందరూ ఓటు హకును సద్వినియోగం చేసుకునేలా ‘స్వీప్’ విస్తృతంగా అవగాహన కల్పించినట్లు తెలిపారు. నూతన ఓటర్లకు కలెక్టర్ రాజర్షి షా ఎపిక్ కార్డులు అందజేశారు. అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ హర్దీప్ సింగ్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, బీఎల్వో సూపర్వైజర్లు, బీఎల్వోలు, విద్యార్థులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.