నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారికి శుభవార్త. ఈనెల 18 నుంచి రెండో విడత ‘కంటివెలుగు’ కార్యక్రమం ప్రారంభం కానున్నది. వైద్య బృందాలు గ్రామాలు, వార్డులకు వచ్చి వైద్యపరీక్షలు నిర్వహించి కండ్లద్దాలు ఇస్తాయి. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తాయి. కార్యక్రమ అమలుకు సంగారెడ్డి, మెదక్ జిల్లాలు సిద్ధమయ్యాయి. కార్యక్రమం అమలుపై ఈనెల 6న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కార్యక్రమం వరంగా మారనున్నది.
సంగారెడ్డి/మెదక్, జనవరి 4(నమస్తే తెలంగాణ) : రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి సంగారెడ్డి, మెదక్ జిల్లాలు సిద్ధమయ్యాయి. ఈనెల 18న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించి అమలు చేయనున్నది. నిర్వహణపై ఈనెల 6న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కంటి వెలుగులో భాగం కంటి సమస్యలు ఉన్నవారిని పరీక్షించడంతో పాటు వారికి అవసరమైన కంటి అద్దాలను ప్రభుత్వం ఉచితంగా అందజేయనున్నది. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయిస్తారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కార్యక్రమం వరంగా మారనున్నది
2018 ఆగస్టు నుంచి 2019 ఫిబ్రవరి వరకు సంగారెడ్డి జిల్లాలో తొలివిడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో 4224 శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల ద్వారా 6,50,000 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో అద్దాలు అవసరమైన 1,18,526 మందికి అందజేశారు. 78,629 మంది రోగులకు పాయింట్ అద్దాలు అందజేశారు. 48,120 మంది రోగులకు ఆపరేషన్లు చేశారు. కంటి వెలుగుతో తమ కంటి సమస్యలు పోయి కొత్త వెలుగులు వచ్చాయని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 17,09,149 జనాభా ఉంది. వీరిలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారిందరికి పరీక్షలు చేయనున్నారు. ఈనెల 18 నుంచి మొదలుకుని 100 రోజుల పాటు ప్రతి గ్రామంలో కంటి పరీక్ష శిబిరాలు నిర్వహిస్తారు. దీనికోసం 69 బృందాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఒక్కో బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్, పారామెడికల్ ఆప్తాలమిక్ అసిస్టెంట్, హెల్త్సూపర్ వైజర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశ వర్కర్లు ఉంటారు. పరీక్షలు నిర్వహించిన నెలలోపే రోగులకు అద్దాలు పంపిణీ చేస్తారు. రోగులకు అందజేసే అద్దాల బాక్స్పైన రోగి పూర్తి వివరాలను తెలియజేసే బార్కోడ్ ఉంటుంది. బార్కోడ్ చెదిరిపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో అద్దాలు పొందిన రోగులకు పాయింట్ పెరిగితే కొత్త అద్దాలను అందజేస్తారు. జిల్లాకు ఇప్పటికే 27,381 అద్దాలు తెప్పించారు. ప్రత్యేకంగా 69 మంది పారామెడికల్ ఆప్తాలమిక్ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 69 మందిని నియమించారు.
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. సెలవు దినాలు మినహాయించి జిల్లాలో వంద రోజుల పాటు శిబిరాలు నిర్వహించి సేవలందించేందుకు 69 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశాం. అవసరమైన వైద్యసిబ్బంది నియామకం పూర్తిచేశాం. అందరి సహకారంతో జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
– డాక్టర్ గాయత్రీదేవి, డీఎంహెచ్వో సంగారెడ్డి
తొలివిడత కంటివెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్లో 2018 ఆగస్టు 15న ప్రారంభించారు. తొలివిడతలో 20 పీహెచ్సీల్లో 20 బృందాలను ఏర్పాటు చేసి 372 గ్రామాలు, 4 వార్డుల్లో 4,39,316 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 63,375 మందికి రీడింగ్ గ్లాసులు అవసరం ఉండగా, 61,695 మందికి పంపిణీ చేశారు. కాగా, రెండో విడతలో ఈసారి జిల్లాలో 4,72,802 మందికి కంటి పరీక్షలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మెదక్ జిల్లాలో 8,85,519 జనాభా ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంత జనాభా 7,39,444 కాగా, పట్టణ జనాభా 1,20,075 ఉంది. ఇందులో 4,72,802 మందికి కంటి పరీక్షలు నిర్వహించుటకు 469 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఈనెల 18 నుంచి 100 రోజుల పాటు శిబిరాలు నిర్వహించేందుకు గ్రామ, వార్డు వారీగా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.
ఈసారి 32 బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో, 8 బృందాలు అర్బన్ ఏరియాలో సేవలందిస్తాయి. ఆప్తాల్మిక్ అధికారులు 40 మంది, 40 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. ఈసారి అత్యాధునిక పరికరాలు, సదుపాయాలతో కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది. కంటి చూపుతో బాధపడుతున్న వారితో పాటు ప్రతి ఒకరికీ స్రీనింగ్ పరీక్షలు చేస్తారు. చూపు మందగించిన వారికి అప్పటికప్పుడే కళ్లద్దాలు అందజేస్తారు. దృష్టిలోపం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు. మోతిబిందు, కార్నియల్ అంధత్వం, డయాబెటిక్ రెటినోపతి, గ్లుకోమా(నీటికాసులు), మెల్లకన్ను, దృష్టిమాంద్యం, కండ్ల కలక, విటమిన్-ఏ లోపం వాటిని గుర్తించి అవసరమైన వారికి చికిత్స లేకపోతే ఆపరేషన్ చేస్తారు.
ఒక్కో బృందంలో మొత్తం 10 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక కంటి వైద్య నిపుణుడు(ఆప్తామాలజిస్ట్), ఇద్దరు ఏఎన్ఎంలు, డేటాఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఆశ కార్యకర్తలు, ఒక ఫార్మసిస్ట్, హెల్త్ అసిస్టెంట్ ఉంటారు. ఒకో బృందం ప్రతిరోజు 128 మందికి పరీక్షలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 35, పట్టణ్రప్రాంతాల్లో 5 బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. మరో 5 బృందాలను బఫర్లో అదనంగా ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం 40 బృందాలను ఏర్పాటు చేశాం. వంద రోజులు శిబిరాలు నిర్వహిస్తాం. ఒకో బృందంలో 10 మంది సభ్యులు ఉంటారు. ప్రతిరోజు 128 మందికి కంటి పరీక్షలు చేస్తారు. 40 మంది ఆప్తాల్మిక్ ఆఫీసర్లు, 40 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాం. ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చాం. జిల్లాలో రెండో విడతలో 4,72,802 మందికి కంటి పరీక్షలు నిర్వహించడమే టార్గెట్గా పెట్టుకున్నాం.
– డాక్టర్ చందునాయక్, డీఎంహెచ్వో మెదక్