Komuravelli Jathara | చేర్యాల, ఫిబ్రవరి 11 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల నాలుగో ఆదివారానికి 35వేల మంది భక్తులు వచ్చారు. భక్తులు పోటెత్తడంతో గదులన్నీ నిండిపోయాయి. పుణ్యస్నానాల అనంతరం భక్తులు క్యూలైన్లలో గంటలపాటు వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు సమర్పించారు. పట్నాలు వేశారు. గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టారు. సంతానం కలగాలని ఒల్లుబండ పూజలు, రాతిగీరల వద్ద మొక్కులు, కోడెను కట్టి స్వామివారిని వేడుకున్నారు. ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
మల్లన్న క్షేత్రంలో ఆలయవర్గాలు ఏర్పాటు చేసిన ఓపెన్ షవర్ల వద్ద స్నానాలకు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అన్నప్రసాద వితరణశాల, పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న ఓపెన్ షవర్ల వద్ద స్నానాలు చేసేందుకు అనువుగా ఉన్నప్పటికీ షవర్ల చుట్టూ తడకలు లేదా వస్ర్తాలు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఇబ్బందిగా ఫీలవుతున్నారు.
చేర్యాల నుంచి కొమురవెల్లి మీదుగా ఐనాపూర్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా హైదరాబాద్ వెళ్లే కొమురవెల్లి ప్రధాన రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పోలీస్శాఖ సూచనలు చేసినప్పటికీ భక్తులు రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపి దర్శనానికి వెళ్లారు. దీంతో గంటపాటు ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు వచ్చి క్లియర్ చేశారు.
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో దర్శనం పాస్ల జారీ ప్రక్రియను ఆలయవర్గాలు కఠినతరం చేశాయి. ఆలయ ఈవో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి దీనిపై ఆలయ సిబ్బంది, కమిటీ సభ్యులు తదితరులతో చర్చించి పాస్లు దుర్వినియోగం కాకుండా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి వీవీఐపీ, వీఐపీ, డోనర్, అధికారులు, ఆలయవర్గాలు, కమిటీ సభ్యుల్లో ఎవరు పాస్ తీసుకుంటున్నారు, ఎంతమంది ఆ పాస్పై దర్శనానికి వెళ్తున్నారనే వివరాలను పాస్తోపాటు రిజిస్టర్లో వారి పేరుతో నమోదు చేస్తున్నారు. దర్శనం పాసుల జారీ ప్రక్రియ కఠినతరం కావడంతో కౌంటర్ వద్ద రద్దీ లేకుండా పోయింది.