పటాన్చెరు, మార్చి 9ః కర్ధనూర్ గ్రామం భేష్ అని మాల్దీవుల ప్రతినిధుల బృందం కొనియాడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూర్లో మల్దివ్ దేశం నుంచి గ్రామాల పరిశీలన, శిక్షణకు వచ్చిన 23 మందితో కూడిన ఎలెక్టెడ్ కౌన్సిల్ మెంబర్స్, మున్సిపల్ మెంబర్స్, అధికారుల బృంద్రం గురువారం పర్యటించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ) తరఫున డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రాం డాక్టర్ అంజన్ కుమార్ భంజ, ఎన్ఐఆర్డీ అధికారులు మధుసూదన్, తాఖీయోద్దీన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర అధికారులు మాల్దీవుల బృందానికి వివరాలు అందించారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, నర్సరీ, పారిశుధ్యం అమలు, డంపింగ్ యార్డును పరిశీలించారు.
ప్రధానంగా తడి,పొడి చెత్త సేకరణ, వాటిని డంపింగ్యార్డుకు తరలించిన తర్వాత కంపోస్టు ఎరువుల తయారీని తెలుసుకున్నారు. మాల్దీవుల దేశం దాదాపు టూరిజంపై ఆధారపడిన దేశమని తమ వద్ద కూడా పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న తడి,పొడి చెత్త సేకరణ, డంపింగ్యార్డుల నిర్వహణను తమ దేశంలోను అమలు చేసేందుకు ప్రతిపాదిస్తామని వివరించారు. హరితహారం ద్వారా పచ్చదనం పెంచడం, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడాన్ని అభినందించారు. ప్రణాళికాబద్ధంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు వివరించారు. ప్రతి గ్రామంలో నర్సరీలను సైతం ఏర్పా టు చేసి సంరక్షిస్తున్నామని బృందానికి తెలిపారు.
కోతులకు ఆహార కేంద్రాన్ని చూసి మాల్దీవుల ప్రతినిధుల బృందం వావ్.. అంటూ ఆశ్చర్యపోయారు. కోతులకు ఆహార కేంద్రమా.? అంటూ తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. తమ దేశంలో కోతుల సమస్య ఉందని ఇది చక్కటి పరిష్కార ఆలోచన అని అన్నారు. కోతులకు పండ్లు, ఫలాలు ఆహారంగా లభిస్తే జనావాసాల మధ్యకు రావని సీఎం కేసీఆర్ చెప్పడంతో గ్రామంలో కోతుల ఆహారకేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని సర్పంచ్ భాగ్యలక్ష్మీ తెలిపారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకమండలిని, గ్రామస్తులను మాల్దీవుల బృందం ప్రత్యేకంగా అభినందించింది. అలాగే, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆశవర్కర్ల పనితీరు, పంచాయతీల్లో గ్రామ సభ, సర్వసభ్య సమావేశంపై అధికారులు వివరాలు తెలిపారు. మహిళా సంఘాలు వాటి పనితీరును వివరించారు.
పంచాయతీలకు ఆదాయం తదితర అంశాలను మాల్దీవుల బృందం అడిగి తెలుసుకున్నది. చక్కటి ప్రణాళికతో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నారని ప్రతినిధులు అన్నారు. మా దేశంలోనూ అనుకూలమైన అంశాలను అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. చక్కటి గ్రామాన్ని చూపించారని అధికారులను అభినందించారు. కార్యక్రమంలో మాల్దీవుల బృందం ప్రతినిధులు మొహమ్మద్ సినద్, అబ్దుల్లా జమీర్, అబ్దుల్లా షరీఫ్, మరియం వకీలా, అయిషాత్ రౌన, అలి అబ్దుల్ లతీఫ్, అమినత్ జీనా, ఫాతుల్లా హసన్, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్, డీఎల్పీవో సతీశ్రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఎంపీవో హరిశంకర్గౌడ్, సర్పంచ్ భాగ్యలక్ష్మి, కార్యదర్శులు నీలిమా, రిజ్వాన్, మధుసూదన్రెడ్డి, రాజ్కుమార్ పాల్గొన్నారు.