సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): మనుషుల్లో ఆరోగ్య సంరక్షణపై పెరుగుతున్న అవగాహన ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా అడ్డమైన తిండి తిని రోగాల బారిన పడటం కంటే, రుచిగా లేకున్నా ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తీసుకోవడమే మంచిదనే భావనకు పట్టణ వాసులు వస్తున్నారు. చిరుధాన్యాల వినియోగం-ఆరోగ్య ప్రయోజనాలపై దేశవ్యాప్తంగా ఇక్రిసాట్ చేసిన అధ్యయనంలో ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాలకే ప్రజలు పాధాన్యత ఇస్తున్నట్లుగా తేలింది. సర్వేలో పాల్గొన్న 91శాతం జనాభాలో మిల్లెట్లు, జొన్నలను ప్రధాన ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా వెల్లడైంది.
ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తేలింది. మిల్లెట్స్, జొన్నల వినియోగంపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పట్టణాల్లో సర్వే చేశారు. క్రమంగా రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా పల్లెల కంటే పట్టణాల్లోనే వీటి వినియోగం పెరుగుతున్నదని వెల్లడైంది. దేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై వంటి నగరాలను ఎంపిక చేసుకుని ఇక్రిసాట్ ఆధ్వర్యంలో సర్వే చేశారు. మొత్తం ఏడు నగరాల్లో లింగబేధం, వయస్సు, ఆదాయ, ఆర్థిక స్థితిగతులను ప్రామాణికంగా తీసుకుని 15,139 మందితో సర్వే నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ నగరం నుంచి సర్వేలో 1509 మంది పాల్గొన్నారు.
అధిక పీచు, ఇతర మైక్రో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉన్న మిల్లెట్లతో పాటు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకునేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. వీటికి చిరుధాన్యాలే ప్రధాన వనరులు కావడంతో వీటి వినియోగం క్రమంగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా సగటున 91శాతం మంది తినేవారు ఉన్నట్లుగా సర్వే ఫలితాల్లో వెల్లడైంది. గడిచిన ఐదారేళ్లలో వీటి వినియోగం పెరగడానికి ప్రధాన కారణాల్లో ఆహారపు అలవాట్లతో కలుగుతున్న అనారోగ్య సమస్యలేనని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. ఇందులో అత్యధికంగా అహ్మదాబాద్లో 48.1 శాతం మంది, ఢిల్లీలో 42.5శాతం, ముంబైలో 20.9శాతం, హైదరాబాద్లో 15.2శాతం మంది అనారోగ్య సమస్యల కారణంగా మిల్లెట్స్, జొన్నలను ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు.
వారానికోసారి, నెలకోసారి, ఏడాదిలో కనీసం రెండుసార్లు అయినా మిల్లెట్లను తినేవారు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో రోజు తినేవారి సంఖ్య ఏటా 10శాతం పెరుగుతున్నదని అధ్యయనంలో తేలింది. వారంలో ఒక్కసారి తినేవారి జాబితాలో 37.7శాతం మంది అహ్మదాబాద్, బెంగళూరులో 71.2శాతం మంది, 57.6శాతం మంది చెన్నై, ఢిల్లీలో 41.9శాతం మంది, హైదరాబాద్లో 56.1శాతం మంది, కోల్కతాలో 52.3శాతం మంది, 52.9శాతం మంది ముంబైలో ఉన్నారు. గడిచిన రెండేండ్లలో తరుచుగా తినేవారి సంఖ్య 10-15శాతం ఆయా నగరాల వారీగా పెరుగుదల ఉందని తేలింది.