సంగారెడ్డి జిల్లాకు కూతవేటు దూరంలోని దాసుగడ్డ తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం బస్తాలున్న ట్రాక్టర్లు, వాహనాలను క్యూలో ఉంచిన రైతులు ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో 24,000 క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉన్నాయి. వీటిని రైసుమిల్లుకు తరలిస్తే తప్పా కొత్తగా రైతులు తీసుకువచ్చే ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. ధాన్యం బస్తాలను మిల్లుకు తరలించేందుకు వాహనాలు రావడం లేదు. దీంతో ఇస్మాయిల్ఖాన్పేట చుట్టుపక్కన ఉన్న ఏడు గ్రామాల రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఒక్క కేంద్రంలోనే కాదు జిల్లాలోని అందోలు, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని పలు కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ఇలానే ఉంది. ధాన్యం సేకరణ సజావుగా సాగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాను కారణంగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణలో అధికార యంత్రాంగం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వశాఖల మధ్య సమన్వయలోపం రైతులకు శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగి సీజన్లో జిల్లాలో 1,96,219 టన్నుల క్వింటాళ్ల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యం పెట్టుకుంది. కాగా, ఇప్ప టి వరకు 92,043 టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. ఇంకా 1.04 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. జిల్లాలో చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణను నిలిపివేశారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు చేర్చాల్సి ఉంటుంది. జిల్లాలో వాహనాల కొరత కారణంగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. కొత్త గా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. జిల్లాలో నాలుగు రోజులుగా కొనుగోలు కేంద్రాలకు వాహనాలు రావడం లేదు. దీంతో అందోలు, నారాయణఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో చాలాచోట్ల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్, సదాశివపేట, కంది, ఇస్మాయిల్ఖాన్పేటలో బుధవారం కొనుగోళ్లు నిలిచిపోయాయి.జిల్లాలో 211 కొనుగోలు కేం ద్రాలు ఉన్నాయి.
ఆయా కొనుగోలు కేంద్రాల నుంచి జిల్లాలో 27 రైస్మిల్లులకు ధాన్యం తరలించేందుకు సుమారు 200 వరకు వాహనాలు అవసరం. పౌరసరఫరాల సంస్థ రెండు వాహన ఏజెన్సీల నుంచి కేవలం 50 వాహనాలకు టెండర్లు ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ప్రసుతం వాహన కాంట్రాక్టర్లు కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించేందుకు అవసరమైన వాహనాలను పంపడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి కొత్తగా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. డిమాండ్కు అనుగుణంగా వాహనాలు ఏర్పాటు చేయనందుకు అధికారులు ఒక ఏజెన్సీని బ్లాక్లిస్టులో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కూలీల కొరత సైతం ధాన్యం సేకరణకు ఇబ్బందిగా మారింది. జిల్లాలో కొనుగోలు కేంద్రాలతో పాటు ధాన్యం బస్తాలను వాహనాల్లో చేర్చేందుకు కూలీలు అవసరం. గతంలో యూపీ, జార్ఖండ్, బీహార్కు చెందిన కూలీలు ధాన్యం సేకరణ, లోడింగ్, మిల్లుల్లో అన్లోడింగ్ పనులు చేసేవారు. ప్రస్తుతం వారంతా ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు తమసొంత గ్రామాలకు వెళ్లారు. దీంతో కూలీల కొరత ఏర్పడి ధాన్యం సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతుల నుంచి అదనంగా నాలుగు కిలోల ధాన్యం సేకరిస్తుండడంతో రైతులు దగాకు గురవుతున్నారు. బస్తాలో తరుగు కలిపి 42 కిలోల ధాన్యం కాంటా వేయాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుంచి 44 నుంచి 45 కేజీల వరకు ధాన్యం కాంటా వేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రతి బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోలు తరుగు పేరుతో అదనంగా ధాన్యం కాంటా చేయడంతో తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో తాలు, మట్టి ఉందన్న నెపంతో తరుగు ఎక్కువగా చూపుతూ రైతుల నుంచి ఎక్కువ ధాన్యం కాంటా చేస్తున్నారు. దీం తో రైతులు నష్టపోతున్నారు. రైతులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు.
డీఆర్డీఏ అధికారులు ట్రక్షీట్లు రూపొందించడంలో జాప్యం చేయడం, మిల్లర్లు తమ వద్దకు వచ్చిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేసుకోకపోవడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. సంగారెడ్డి జిల్లాలోని 211 కేం ద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని ను 27 రైస్మిల్లులకు తరలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 92,043 టన్నుల ధాన్యం సేకరించగా..88,568 టన్నుల ధాన్యం రైసు మిల్లులకు చేరింది. రైసు మి ల్లులకు ఇంకా 3474 టన్నుల ధాన్యం చేరాల్సి ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వాహనాల కొరత కారణంగా రైసు మిల్లులకు ధాన్యం చేరడం లేదు. ధాన్యం వాహనాలు వెళ్లినా మిల్లర్లు వెంటవెంటనే ధాన్యం బస్తాలను అన్లోడ్ చేయ డం లేదు. దీంతో వాహనాలు మిల్లుల వద్ద బారులు తీరి కనిపిస్తున్నాయి. ఒక్కోలారీ అన్లోడ్ కావడానికి మిల్లర్లు రెండురోజుల సమయం తీసుకుంటున్నారు. దీంతో ధాన్యం తరలింపు వేగంగా సాగడం లేదు. డీఆర్డీఏ సేకరించిన ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయడంతో పాటు ట్రక్షీట్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు 92,043 టన్నుల సేకరించ గా..81,781 టన్నులకు ట్యాబ్ ఎంట్రీలు జరిగాయి. 70,064 టన్నుల ధాన్యానికి ట్రక్షీట్లు జనరేట్ చేశారు. దీంతో రైతులకు వెంటనే డబ్బులు అందడం లేదు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 18,045 రైతుల నుంచి రూ. 202.77 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేశారు. 11,039 మం ది రైతులకు రూ.137 కోట్ల డబ్బులు చెల్లించారు. ఇంకా 7006 మంది రైతులకు రూ.65 కోట్లు చెల్లించాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరిస్తున్నాం. అక్కడక్కడ చిన్నపాటి సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లు ఎక్కడైనా నిలిచినట్లు తెలిస్తే వెంటనే కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నాం. వాహనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటు న్నాం. సకాలంలో వాహనాలు ఇవ్వనందుకు వాహన ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. తరుగు సమస్య ఎక్కడా లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా రైతులు ఇబ్బందులు పడితే వెంటనే సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. మరో పదిరోజుల్లో ధాన్యం సేకరణ వందశాతం పూర్తి చేస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం.