హుస్నాబాద్, నవంబర్ 23 : సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి, మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తున్నదని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్లోని సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. దవాఖానలోని వార్డుల్లో తిరిగి శానిటేషన్, వైద్యసేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రికార్డుల నిర్వహణ లోపంపై అసహనం వ్యక్తం చేశారు. దవాఖానకు కావాల్సిన సౌకర్యాలు, పరికరాలు, వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.
డయాలసిస్ సెంటర్, మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దవాఖానల్లో ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్తే వెంటనే సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైద్యారోగ్యశాఖ మం త్రిగా తన్నీరు హరీశ్రావు దవాఖానల్లో పెనుమార్పులు తీసుకొచ్చి సర్కారు వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. వైద్యులు, సిబ్బంది పనితీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆపరేషన్లు, పేషెంట్ల సంఖ్య పెరగాలని, ఇందుకు వైద్యులు, సిబ్బంది సేవాభావం, నిబద్ధతతో పనిచేయాలన్నారు.
దవాఖానకు ఎక్స్రే మిషన్ మంజూరు, ల్యాబ్లో పరికరాల కొనుగోళ్లు, రేడియాలజిస్టు, అదనంగా గైనకాలజిస్టు, జనరల్ ఫిజీషియన్ వైద్యుల నియామకానికి సంబంధించి మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నియామకం జరిగేలా చూస్తామన్నారు. డెలివరీలు, అన్నిరకాల ఆపరేషన్ల సంఖ్య పెరగాలని, ఇన్ని సదుపాయాలు గల దవాఖానకు పేషెంట్లు రాకుంటే వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనమవుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పేషెంట్ల సంఖ్యను పెంచాలని, పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించి, సర్కారు వైద్యంపై భరోసా కల్పించాలని వైద్యులకు సూచించారు.
పేషెంట్లకు పైసా ఖర్చు కాకుండా వ్యాధి నయం అయ్యేందుకు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను కూడా వినియోగించుకోవాలన్నారు. వైద్యులు, సిబ్బంది తన పనితీరును మార్చుకొని పేషెంట్ల సంఖ్యను పెంచేందుకు సమష్టిగా పనిచేయాలన్నారు. ఆయన వెంట వైద్యవిధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సాయికిరణ్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్రెడ్డి, వైద్యులు డాక్టర్ జయంత్, వెంకటరితేష్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నాగమణి ఉన్నారు.