రామాయంపేట, ఫిబ్రవరి 3: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఎండల తీవ్రత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో అడవి జంతువుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. మెదక్ జిల్లా రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అక్కన్నపేట, తొనిగండ్ల గ్రామ బీట్ పరిధిలోని అడవి జంతువుల దాహం తీర్చేందుకు 16సాసర్ ఫీట్లలో నీటిని ఫారెస్ట్ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. జంతువులతో పాటు అడవిలో మొక్కలకు వాటర్ ట్యాంకర్తో నీళ్లను పడుతున్నామని ఫారెస్ట్ బీట్ అధికారి రాము తెలిపారు. రెండు రోజులకోసారి నీళ్లు నింపుతున్నామని ఆయన తెలిపారు.
అడవిలో నాటిన మొక్కలకు ఉపాధి హామీ కూలీల ద్వారా రోజూ నీళ్లు అందిస్తున్నామన్నారు. అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అడవిలో పొడవాటి చెట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల ఆనవాళ్లను గుర్తిస్తున్నామన్నారు. 16 సాసర్ ఫీట్ల దగ్గర ఎక్కడ ఎలాంటి జంతువుల కదలికలు వచ్చినా వెంటనే రామాయంపేట అటవీశాఖ కార్యాలయంలో సైరన్ మోగుతుందని బీట్ అధికారి రాము తెలిపారు. సైరన్తో అటవీ సిబ్బంది అప్రమత్తమవుతామని తెలిపారు. అడవిలోకి వెళ్లే రైతులు తమ పశువులను మొక్కలు మేయకుండా చూడాలన్నారు. తమ అనుమతి లేనిది అడవిలోకి వెళ్లవద్దన్నారు. అడవిలోకి అగ్గిపెట్టెలు, టార్చిలైట్లు తీసుకెళ్లరాదని ఆయన సూచించారు.