ఉమ్మడి జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది. ఆకాశం నుంచి మేఘాలు దిగివచ్చినట్లుగా మంచు కురిసింది. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదభరితంగా మారింది. పల్లెల్లో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలైనా మంచు తెరలు తొలిగిపోలేదు.
ఉదయం పనులు చేసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లాల్సి వచ్చింది. రోజురోజుకూ పెరుగుతున్న చలి కారణంగా శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు, చిన్నారులు ఉదయం వేళల్లో బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాను శుక్రవారం పొగమంచు కమ్మేసింది. ఉదయం 10గంటలు దాటినా మంచుమూలంగా ఎవరూ బయట కనిపించలేదు. మంచు, చలితో అన్నదాతలు సైతం పొలాలకు వెళ్లకుండా ఇండ్లలోనే ఉండిపోవాల్సిన వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భానుడు కలిపించలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. పొద్దంతా మబ్బులతో నిండి ఉండడంతో ఎప్పుడు రద్దీగా ఉండే పట్టణాలతోపాటు గ్రామాలన్నీ బోసిపోయాయి.
మంచుతోపాటు చిన్నపాటి చినుకులు సైతం కురవడంతో ధాన్యాన్ని ఆరబోసిన రైతులు ఒకేచోటికి తరలించి టార్పాలిన్లు కప్పారు. పొగమంచు మూలంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యవసరమైతే తప్పా మంచు తగ్గే వరకు ప్రయాణాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా వచ్చే వాహనాలు, మూల మలుపులు, రోడ్డు కూడా సరిగ్గా కనిపించక పోవడంతో హెడ్లైట్లు వేసుకొని ప్రయాణించాల్సి వచ్చింది.