మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 1: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందు నుంచే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 10,700 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 5,347 మంది బాలురు, 5,353 బాలికలు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 21389 విద్యార్థులకు 118 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 6 పేపర్లకే పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షా కేంద్రాలు తెలుసుకోవడానికి ‘సెంటర్ లోకేషన్’ యాప్ను రూపొందించారు. విద్యార్థులు సివిల్ డ్రెస్సులోనే పరీక్షలకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నారు. ఈ కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్, స్టేషనరీ దుకాణాలను మూసివేయించనున్నారు. విద్యార్థులు www.bseteleangana.bov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను పరీక్షకు అనుమతించనున్నట్లు అధికారులు సూచించారు.
విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాసేలా ఏర్పాట్లు చేశాం. తాగు నీరు, వైద్య సదుపాయం కల్పిస్తున్నాం. 20 మందికి మాత్రమే ఒక గది కేటాయించాం. మాస్ కాపీయింగ్ జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షలంటే విద్యార్థుల్లో భయం పోవాలి. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాస్తే ఉత్తమ ఫలితాలు సాధించొచ్చు.
– రాధాకిషన్, డీఈవో, మెదక్