సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 3: లబ్ధిదారులకు రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టేందుకు సంగారెడ్డి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో రెండో విడత గొర్రెల పంపిణీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గొర్రెల రవాణాకు ఈ టెండర్ ప్రక్రియ పారదర్శకంగా నిబంధనల మేరకు జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు.
రెండో విడత గొర్రెల పంపిణీ పథకం కింద లబ్ధిదారుల జాబితా పరిశీలించి, అందులో ఎవరైనా మరణించి ఉంటే నామినీ వివరాలు సేకరించాలన్నారు. జిల్లాలో గొల్ల కురుమ సంఘాలు, లబ్ధిదారులతో వాటా సేకరణ కోసం షెడ్యూల్ రూపొందించి అవగాహన కల్పించాలని సూచించారు. గొర్రెల యూనిట్ వ్యయాన్ని ప్రభుత్వం రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచిందన్నారు. వీటిలో 25 శాతం అంటే రూ.43వేల 750లను లబ్ధిదారుడి వాటా అని, మిగతా రూ.లక్షా 31 వేల 250 ప్రభుత్వ సబ్సిడీ విడుదల చేస్తుందని వివరించారు. మండల స్థాయిలో లబ్ధిదారులతో అవగాహన సమావేశాలు నిర్వహించి వాటా సేకరించాలని తెలిపారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమావేశాలు
నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గొర్రెల కొనుగోలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి గొర్రెకు బీమా సౌకర్యం, జియో ట్యాగింగ్ చేస్తారన్నారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారితో సమన్వయం చేసుకుని పని చేయాలని ఏడీలను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వసంత కుమారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.