సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, జూన్ 7: బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ఈ నెల 9న జరిగే సంక్షేమ సంబురాల దినోత్సవం రోజు లాంఛనంగా ప్రారంభించాలని, అదేరోజు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సంగారెడ్డి నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కుల వృత్తులకు అందించే ఆర్థికసాయానికి ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులను గుర్తించి సహాయం అందించాలన్నారు. బీసీ కుల, చేతి వృత్తుల వారు ఆన్లైన్లో సాయంత్రం వరకు చేసుకున్న దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. దీని కోసం ఈ నెల 9 నుంచి 20 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. విచారణ అనంతరం దశల వారీగా ప్రతినెలా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు వివరించారు. కుల వృత్తుల వారికి అందించే ఆర్థిక సహాయం కోసం కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 20 వరకు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం పొందిన తర్వాత వెబ్సైట్లో పెట్టాలన్నారు. జాబితా సీరియల్ ప్రకారం ప్రతి నెలా పారదర్శకంగా స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు.
వైద్యారోగ్య దినోత్సవానికి నిధులు విడుదల
ఈ నెల 14న నిర్వహించే వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గానికి అదనంగా రూ.లక్ష వైద్య శాఖ నుంచి విడుదల చేస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. పండుగ వాతావరణంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. వైద్య శాఖలో మంచి పనితీరు కనబరిచిన అధికారులకు, ఏఎన్ఎమ్లకు, ఆశా కార్యకర్తలకు అవార్డులు అందించాలన్నారు. వైద్య శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేయాలన్నారు. కేసీఆర్ న్యూట్రీషన్ పథకం ప్రారంభించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో ఘనంగా వేడుకలు నిర్వహించాలన్నారు. వైద్య విద్యార్థులను వేడుకలకు ఆహ్వానించాలని, ఆరోగ్యశ్రీ సేవలు, డయాలసిస్, కంటి వెలుగు, కేసీఆర్ కిట్ లబ్ధిదారులు పాల్గొనేలా చూడాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో నగేశ్, డీఆర్డీవో శ్రీనివాసరరావు, బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్, డీడబ్ల్యూఓ పద్మావతి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి, మైనార్టీ సంక్షేమ అధికారి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నుంచి కలెక్టర్ రాజర్షిషా లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడతామని మంత్రులకు వివరించారు. మెదక్ జిల్లా నుంచి ఆదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్టీవో శ్రీనివాస్, జిల్లా మహిళా సంక్షేమాధిరి బ్రహ్మజీ, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి విజయశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
కుటుంబంలో ఒకరికి మాత్రమే..
మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ బీసీ కుల వృత్తుల వారికి కుటుంబంలో ఒకరికి మాత్రమే ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం యూనిట్ను గ్రౌండింగ్ చేసి వారి ఫొటోలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి నెలా లబ్ధిదారులకు సాయం అందిస్తామన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీని పారదర్శకంగా చేపట్టాలన్నారు.