దుబ్బాక అంటే మెట్ట ప్రాంతం. పడావు పడ్డ భూములు. ఇంకిపోయే బోర్లు. సాగునీటి కోసం తండ్లాడిన రైతాంగం. కానీ, స్వరాష్ట్రం తెలంగాణలో పరిస్థితి పూర్తిగా మారింది. ఈ ప్రాంతంలో అన్నదాతలు, బీడీ , చేనేత, గీత కార్మికుల ఆక్రందనలు చూసిన గత బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధికి కృషిచేసింది. మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్రెడ్డి చేసిన అభివృద్ధితో దుబ్బాక నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కండ్ల ముందున్న ప్రగతికే ప్రజలు పట్టం కట్టారు. ఈ గడ్డపై విద్యనభ్యసించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. తన ఎదుగుదలకు కారణం దుబ్బాక గడ్డనే అని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కేసీఆర్పై మమకారం, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డిపై ఉన్న నమ్మకంతో ప్రజలు బీఆర్ఎస్కు పట్టంకట్టారు.
– దుబ్బాక, డిసెంబర్ 5
దుబ్బాక, డిసెంబర్ 5 : ఉద్యమగడ్డ దుబ్బాకలో గులాబీ జెండా రెపరెపలాడింది. దుబ్బాక బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. ఉద్యమాల పురిటి గడ్డగా పేరొందిన దుబ్బాకలో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఈ గడ్డ ఉద్యమాలతో పాటు పలు రాజకీయ పార్టీలను ఆదరించి చైతన్య వేదికగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో దుబ్బాక గడ్డ కీలకంగా మారిం ది. తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడంతో పాటు ఉవ్వెత్తున ఎగిసేందుకు ఈ ప్రాంత ఉద్యమకారుల కృషి ఎనలేనిది.
ఈ గడ్డపై విద్యనభ్యసించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. తన ఎదుగుదలకు కార ణం దుబ్బాక గడ్డనే అని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. విద్యబుద్ధులు నేర్పిన దుబ్బాకపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ ఉన్నది. ఇటీవల (పది రోజుల కిందట) దుబ్బాకలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేసీఆర్ దుబ్బాకపై తనకున్న ప్రేమాభిమానాన్ని ప్రజలతో పంచుకున్నారు. కేసీఆర్పై మమకారం, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డిపై ఉన్న నమ్మకంతో దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారు.
దుబ్బాకలో ఉద్యమంలా పోలింగ్..
తెలంగాణ ఉద్యమం నుంచి దుబ్బాక బీఆర్ఎస్కు కంచుకోటగా ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి దుబ్బాక ప్రజలు గులాబీ పార్టీకే జై కొట్టారు. 2020 ఉప ఎన్నికల్లో కొన్ని కారణాలతో బీజేపీ స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీకే నియోకవర్గ ప్రజలు పట్టం కట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి భారీ మెజార్టీని అందించి దుబ్బాక గడ్డపై గులాబీ జెండా ఎగురవేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా పోలింగ్ జరిగింది.
ఉద్యమంలా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో 1,01,081 మంది మహిళలు, 97,019 మంది పురుషులు, మొ త్తం 1,98,100 ఓటర్లు ఉన్నారు. ఇందులో 87,815 మహిళలు, 85,555 మంది పురుషులు మొత్తం 1,73,370 మంది (87.51%) ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఓటేసేందుకు ఓ ఉద్యమంలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గతంతో పోల్చితే ఈ ఎన్నికల్లోనే దుబ్బాక నియోజవకర్గంలో అత్యధికంగా పోలింగ్ జరగడం విశేషం. గత 2018 ఎన్నికల్లో 85 శాతం పోలింగ్ కాగా..ఈ ఎన్నికల్లో 87 శాతం పోలింగ్ జరిగింది.
బీఆర్ఎస్ వెంటే దుబ్బాక ప్రజలు
తెలంగాణ ఉద్యమం నుంచి దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగినా దుబ్బాకలో మాత్రం బీఆర్ఎస్ కారు జోరు కొనసాగింది. ఇక్కడ కాంగ్రెస్కు కనీసం డిపాజిట్ దక్కకుండా పోయింది. దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలిపి రాష్ట్రస్థాయిలో రికార్డు సృష్టించారు. అత్యధిక పోలింగ్తో పాటు ఫలితాల్లో ప్రత్యర్థులను చిత్తు చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి ఘన విజయాన్ని అందించారు. దుబ్బాక నియోజకవర్గంలో 253 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,73,370 ఓట్లు పోలయ్యాయి.
ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి 97,451 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావుకు 43,744 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డికి 24,947 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి సల్కాం మల్లేశానికి 1197 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు అందనంత దూరంగా దిగువస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్లు ఉండిపోయాయి. ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ప్రతి రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డికి మెజార్టీ ఇచ్చారు. 253 పోలింగ్ కేంద్రాల్లో కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో (తొగుట, తుక్కాపూర్) కాంగ్రెస్కు స్వల్పంగా ఆధిక్యత రాగా , మిగిలిన 251 పోలింగ్కేంద్రాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డికి మెజార్టీని అందించారు.కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ దక్కక పోవడం విశేషం.
అత్యధిక మెజార్టీలో.. నాలుగో స్థానంలో ‘దుబ్బాక’ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నాలుగో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు. మెదక్ ఎంపీగా ప్రభాకర్రెడ్డి రెండు సార్లు భారీ మెజార్టీతో రికార్డు సృష్టించగా, ఈ ఎన్నికల్లో 53,513 ఓట్ల మెజార్టీతో ప్రత్యేకత చాటారు. బీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ప్రజలు భారీ మెజార్టీని అందించి, ఉద్యమ సత్తాను చాటుకున్నారు. రాష్ట్రంలో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిచిన వారిలో 4వ స్థానంలో దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి నిలిచారు. మొదటి స్థానంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు 85,576 మెజార్టీ రాగా, ద్వితీయ స్థానంలో సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు 82,308 మెజార్టీ, తృతీయ స్థానంలో కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు 71,387, నాలుగో స్థానంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి 53,513 మెజార్టీతో ప్రత్యేకతను చాటుకున్నారు.
అభివృద్ధికి పట్టం కట్టిన దుబ్బాక ఓటర్లు
దుబ్బాక నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు. తొమ్మిదేండ్లలో కేసీఆర్ (బీఆర్ఎస్) ప్రభుత్వంలోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిచింది. దుబ్బాక నియోజకవర్గంలో అధికంగా గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ రైతులు, బీడీ, చేనేత, గీత కార్మికులు అధికంగా ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రైతులకు రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ , కేసీఆర్ కిట్ వంటి పథకాల వల్ల లబ్ధి పొందారు. మిషన్ భగీరథతో తాగునీరు, మల్లన్న సాగర్తో సాగునీటి కష్టాలు తీరాయి.
నియోజకవర్గంలో ప్రధానవాగు కూడవెల్లి జీవనదిగా మారింది. రైతులకు పంట సాగు సమస్యలతో పాటు 24 గంటల కరెంట్ సరఫరా చేయడం వల్ల బీఆర్ఎస్కు పట్టం కట్టారు. వీటితో పాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, మండల కేంద్రాలకు రోడ్లు, పలు చోట్ల వంతెనల నిర్మాణాలు జరిగాయి. దుబ్బాకలో విద్యనభ్యసించిన కేసీఆర్ బడికి రూ. 20 కోట్లు మంజూరు చేసి, అధునాతన హంగులతో రాజమహాల్ను తలపించే మాదిరిగా అద్భుతమైన పాఠశాల భవనాన్ని నిర్మించారు. మూడు జిల్లాలో సరిహద్దుగా ఉన్న దుబ్బాకలో రూ.20 కోట్లతో వంద పడకల దవాఖాన భవనం, పేదలకు ఒకే చోట వెయ్యి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి మోడల్ కాలనీగా ఏర్పాటు చేశారు. రూ. 4 కోట్లతో సకల హంగులతో మోడల్ బస్టాండ్ భవనం నిర్మించారు. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో నూతనంగా నార్సింగ్, రాయపోల్, అక్బర్పేట-భూంపల్లి మండలాలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారులో నెలకొంది.