పుల్కల్, సెప్టెంబర్ 7: సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది. మరో టీఎంసీ నీరు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలో వర్షాలు అధికంగా కురవకపోవడంతో ప్రాజెక్టులోకి వచ్చే వరద తగ్గిందన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెల ఇదే సమయంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలామన్నారు.
ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టడంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని జెన్కో ఏడీ కుర్మి పాండయ్య తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29,917 టీఎంసీలకు గాను, ప్రస్తుతం ప్రాజెక్టులో 28.279 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు నీటి పారుదల శాఖ డిప్యూటీ డీఈ నాగరాజు వెల్లడించారు.