సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో వివాదాస్పద భూమిలో అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. బుధవారం డీఎల్పీవో సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోలీస్ బృందాలతో కలిసి భారీగా అక్రమ నిర్మాణాలను కూల్చారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, రియల్ వ్యాపారులు, కబ్జా స్థలంలో ఇండ్లను కొన్న బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తొలిగించి అక్రమ నిర్మాణాల కూల్చివేత జరిగేలా చూశారు. ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నందున నిర్మాణాలు చేపట్టరాదని గతంలోనే అధికారులు నోటీసులు జారీచేశారు.
పటాన్చెరు/అమీన్ఫూర్, డిసెంబర్ 21: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో వివాదాస్పద భూములను కబ్జా చేసి ఏకంగా కాలనీనే కట్టిన ప్రబుద్ధులపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ కాలనీలో రెండు నెలల్లోనే 110ఇండ్ల వరకు నిర్మాణాలు జరిగాయి. వివాదాస్పద భూముల్లో జరుగుతు న్న ఈ కబ్జాను చూసి కలెక్టర్, డీపీవో వరకు వరుస ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు కఠిన చర్యలకు దిగారు. బుధవారం అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో డీఎల్పీవో సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీ అధికారు లు, పోలీస్ బృందాలతో కలిసి నాలుగు జేసీబీలు, ట్రాక్టర్ల తో అక్రమ నిర్మాణాలను కూల్చడం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, రియల్ వ్యాపారులు, కబ్జా స్థలం లో ఇండ్లను కొన్న బాధితులు అధికారులను ప్రతిఘటించారు. జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తొలిగించారు. ప్రతిఘటించిన వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఒక్కో ఇంటిని అధికారులు కూల్చివేస్తూ ముందుకు పోయారు. అధికారుల సమక్షంలో ఒక్కో ఇంటికి వెళ్లి కూల్చివేతలు చేస్తున్న సమయంలో ఆ ఇంటిని కట్టుకున్న బాధితులు లబోదిబోమన్నా రు. తమ వద్ద నోటరీలు ఉన్నాయని వాపోయారు. మీకు ఎవరు అమ్మారో వారివద్ద నష్టపరిహారం తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇది కోర్టు వివాదంలో ఉన్న ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారు. ఇక్కడ కబ్జాలు చేయడం, అక్రమంగా ఇండ్లను నిర్మించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఐలాపూర్ తండా, అమీన్ఫూర్కు వెళ్లే దారిలో కట్టిన ఈ కాలనీ అంతా అక్రమమని, ఎలాంటి పర్మిషన్లు లేకుండా కట్టారని పంచాయతీ కార్యదర్శి హిమబిందు గతంలో నోటీసులు ఇచ్చారు. అయినా అక్రమ నిర్మాణాలు, కబ్జాలు కొనసాగుతుండటంతో జిల్లా అధికారులు సీరియస్ యాక్షన్కు దిగారు. కొన్ని రోజుల్లోనే ఈ అక్రమ కాలనీ పుట్టుకొచ్చింది. నిజాం కాలం నాటి ఈ సర్ఫేఖాస్ భూ వివాదంలో ప్రభుత్వంతో కొందరు హక్కుల కోసం పోరాడుతున్నారు. మరికొందరు రైతులు కోర్టులో పోరాడుతున్నారు. మరో పక్క నిజాం వారసులు కోర్టు మెట్లు ఎక్కి సుదీర్ఘకాలంగా ఆస్తి కోసం గొడ వ పడుతున్నారు.
నిజాం వద్ద ఆస్తిని లీజుకు తీసుకున్న వ్యక్తు లు న్యాయపరంగా కోర్టులోనే తెల్చుకునే పనిలో ఉన్నారు. మరోపక్క రాజ్గోపాల్నగర్ అనే వ్యక్తి పేరున 1980 దశా బ్దంలో అక్రమ వెంచర్ వేశారు. ఆ వెంచర్లో ప్లాట్లు కొన్నవారు కోర్టులో కేసులు వేశారు. ఇలా అనేక పార్టీలు ప్రభుత్వంతో న్యాయపోరాటం చేస్తున్నాయి. కోర్టు వివాదాలు పరిష్కారం కాకముందే కొందరు ఈ భూమిలో అక్రమ రియల్ వ్యాపారం ప్రారంభించారు. అధికారులు చర్యలు ప్రారంభించడంతో ఐలాపూర్ తండా ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడంతో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి.
నోటరీలు రాసి 150గజాలు, 200గజాల చొప్పున ప్లాట్లు అమ్ముతున్నారు. రూ. 12లక్షల నుంచి 16లక్షల వరకు ఒక్కో ప్లాట్ను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహా రం చక్కదిద్దేందుకు పెద్ద వ్యవస్థనే అక్కడ ఏర్పాటు చేశారు. అమ్మిన ప్లాట్లో వారంలోపు ఇల్లు కట్టించే వరకు అమ్మినవారే బాధ్యత తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీం తో వారంలోపు ప్లాటు, దానిలో ఇల్లు, ఇంటి నంబర్, విద్యు త్ కనెక్షన్ సైతం అందజేస్తున్నారని తెలిసింది. ఈ తతంగం కారణంగా కొద్ది రోజుల్లోనే 110 ఇండ్ల నిర్మాణం జరిగాయి. దాదాపు 70ఎకరాల భూమి అన్యాక్రాంతం అయ్యింది. మరో 30 ఎకరాలకు పైగా రోడ్డుకు అటుపక్క కబ్జా చేసి పునాదులు వేశారు. 1నుంచి 200 సర్వే నంబర్లలో ఐలాపూర్, ఐలాపూర్ తండాల్లో 1263 ఎకరాల సువిశాల సర్ఫేఖాస్ భూమి ఉంది. నిజాం నవాబుల కాలంలో దాదాపు 90ఏండ్ల క్రితం నాటి వివాదం ఇంకా కొనసాగుతున్నది. నిజాం నవా బు వద్ద లీజుకు తీసుకున్న వ్యక్తులు మరొకరికి లీజుకు ఇవ్వడంతో వివాదం ప్రారంభమైంది. ఈ వివాదాస్పద భూమిలో ప్రభుత్వంపై పలువురు ప్రైవేటు వ్యక్తులు పోరాడుతున్నారు. గతంలో కొన్ని కోర్టు తీర్పులు వచ్చాయి. వాటి పైనా కొంద రు కోర్టుకు వెళ్లారు. కోర్టులో పలు రకాల కేసులు ఉన్నా, ప్రభుత్వ అధికారులు ఈ స్థలం సర్కారుకే చెందాలని న్యాయపోరాటం చేస్తున్నారు.
ఈ రెండు గ్రామాల రైతులు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశతోను ఉన్నారు. న్యాయపోరాటం కోర్టులో చేస్తుండగానే చకచకా కబ్జాలు జరుగుతుండటంతో మేల్కొన్న అధికారులు ఈ అక్రమణలను తొలిగించారు. అధికారులు ఈ సర్వే నంబర్లపై పూర్తిస్థాయిలో సర్వే చేసి, కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని వివాదాన్ని పరిష్కరించే అవకాశం ఉన్నా, నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో అన్ని సర్వే నంబర్లు ప్రమాదంలో పడుతున్నాయి. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు, రియల్టర్లు కబ్జాలకు దిగుతున్నారు. సామాన్యులకు అక్రమంగా కబ్జా చేసి అమ్ముతున్నారు. అధికారులు గట్టి చర్యలు తీసుకుంటే అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ భూములకు రక్షణ లభిస్తుంది. కోర్టు తీర్పులను సమీక్షించి అధికారు లు గట్టి చర్యలకు దిగితేనే సామాన్యులు నష్టపోయారు.