రామాయంపేట, ఏప్రిల్ 19: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను 24గంటల్లో పోలీసులు అరెస్టు చేయాలని, ఈ విషయమై జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. శుక్రవారం రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్లో ఆయన పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని మహిళలతో మాట్లాడారు.
దోషులెంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మహనీయుడికి అవమానం జరగడం మంచి పద్ధతి కాదని, నిందితులు ఎంతటి వారైనా శిక్షార్హులేనని అన్నారు. ఆయన వెంట దళిత బహుజన నాయకులు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గర్గుల శ్రీనువాస్, పాతూరి రాజు, లద్ద నర్సింహులు, కిషన్, కరికె విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.