సిద్దిపేట అర్బన్, మే 31: పదేండ్లలో వందేండ్ల అభివృద్ధి సిద్దిపేటలో జరిగిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట విపంచి కళా నిలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ గోదావరి నీళ్లు, సిద్దిపేట జిల్లా ఏర్పాటు, పోలీస్ కమిషనరేట్, మెడికల్ కాలేజీ, రైలు సౌకర్యం, రింగ్ రోడ్లు ఇలా ఏండ్లుగా పెండింగ్లో ఉన్న పనులు చేసుకున్నామని తెలిపారు.
21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ రాకముందు, నేడు ఏ విధంగా ఉందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వచ్చిననాడు వైద్యారోగ్యశాఖలో 14వ స్థానంలో ఉంటే, నేడు మూడో స్థానంలో ఉందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 85 గ్రామ పంచాయతీల్లో గతంలో ఒక్క వైకుంఠధామం, డంపింగ్ యార్డు, నర్సరీ, ట్రాక్టర్ లాంటివి ఉన్నాయా అని అడిగారు. నేడు ప్రతి గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఓడీఎఫ్ ప్లస్లో తెలంగాణ వంద శాతం ఉంటే, గుజరాత్లో కేవలం 26 శాతం మాత్రమే ఉందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండి స్వయంగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వైద్యారోగ్య చిట్టచివరి స్థానంలో ఉందన్నారు. సంసద్ ఆదర్శ యోజనలో ఉన్న మొదటి 20 గ్రామాల్లో 19 మన తెలంగాణ గ్రామాలే ఉన్నాయన్నారు.
నాడు లక్ష ఎకరాలు.. నేడు 7 లక్షల ఎకరాలు..
అంబేద్కర్ చెప్పినట్లు నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుందని, ఇది చాలా ప్రమాదకరమని మంత్రి హరీశ్రావున్నారు. జూన్ 2 నుంచి జూన్ 22 వరకు జరిగే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలన్నారు. తెలంగాణ రాకముందు యాసంగిలో సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష ఎకరాలు వరి పండితే, నేడు 7 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, నాడు రూ.33 కోట్ల పంట పండితే, నేడు రూ.380 కోట్ల విలువ గల ధాన్యం కొంటున్నట్లు తెలిపారు. పంట కాలాన్ని నెల ముందుకు తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తాను కూడా రైతులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అవగాహన కల్పిస్తానన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు మూసివేసినట్లు తెలిపారు. ప్రతి రైతువేదికలో పండుగ వాతావరణంలో వేడుకలు జరగాలన్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం కిరణ్కుమార్ రెడ్డి తెలంగాణలో పవర్ ఉత్పత్తి కేంద్రాలు లేవని, కరెంట్ ఉండదని, కట్టెపట్టుకొని చెప్పాడని, ఆ విషయాన్ని ప్రజలకు తెలపాలన్నారు. మీ బతుకంతా చీకటి అయితదని చెప్పిన ఆయనకే చీకటి అయిందని, ఇప్పుడు తెలంగాణ మొత్తం వెలుగయిందన్నారు.
చెరువు ఊరికి ఆదెరువు..
చెరువు నిండితే ఊరు నవ్వినట్టు ఉంటుందని, చెరువు ఊరికి ఆదెరువు అన్నారు. నేడు చెరువులు ఎప్పుడూ నిండే ఉంటున్నాయని, కాబట్టి చెరువుల పండుగ ఘనంగా నిర్వహించాలన్నారు. ఆసరా పింఛన్, ఉచిత బియ్యం పంపిణీ వల్ల పేదల్లో, వృద్ధుల్లో ఆత్మగౌరవం పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 25వేల మంది బీడీ కార్మికులు ఉన్నారని వారికి పింఛన్ అందుతున్నదన్నారు. బీసీ కులాల్లోని కొంతమంది కులవృత్తుల ఆర్థిక సాయం చేసే కార్యక్రమం, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభిద్దామన్నారు. సిద్దిపేటలో 500 మందికి ఆటోనగర్లో కేటాయించిన స్థలాలు మంజూరు చేద్దామన్నారు. సిద్దిపేట జిల్లా కాకముందు సంగారెడ్డికి పోవాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్లమన్నారు. ఈ కొత్త కార్యాలయాల వల్ల పని భారం తగ్గి, పరిపాలన సౌలభ్యం పెరిగిందన్నారు.
విషం చిమ్మేవారి నోరు మూయించాలి..
ఉత్సవాల్లో భాగంగా జరిగే కార్యక్రమాల ద్వారా సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పలు విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమాలపై విషం చిమ్మే వారి నోరు మూయించాలన్నారు. సిద్దిపేట జిల్లా లో కవులకు, రచయితలకు కొదవ లేదన్నారు. వీరందరినీ భాగం చేస్తూ సాహిత్య దినోత్సవం నిర్వహించాలన్నారు. గృహలక్ష్మి పథకం మహిళలకు ఇస్తామని, వారి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. న్యూట్రీషన్ కిట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో ఇప్పుడున్న 1450 పడకలకు అదనంగా మరో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన కోసం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. హరితోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో 1000 మొక్కలకు తగ్గకుండా, పట్టణంలో పది వేల మొక్కలు నాటాలన్నారు. సిద్దిపేట చుట్టూ నూతనంగా నిర్మిస్తున్న రెండో రింగ్ రోడ్డు చుట్టూ 2 లక్షల మొక్కలు నాటాలన్నారు. మనఊరు-మనబడిలో భాగంగా పూర్తయిన పాఠశాలలను ప్రారంభించాలని తెలిపారు.
సమన్వయంతో పని చేయాలి..
– సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మొదటి రోజు సంబంధిత కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయాలన్నారు. రెండో రోజు జరిగే తెలంగాణ రైతు దినోత్సవాన్ని సిద్దిపేట జిల్లాలోని 122 రైతు వేదికల్లో ఘనంగా ని ర్వహించాలన్నారు. కార్యక్రమాల నిర్వహణ కోసం మండల స్థాయిలో సన్నాహక సమావేశం నిర్వహించుకొని యాక్షన్ ప్లా న్ తయారు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ వంగ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజులారాజనర్సు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.