హుస్నాబాద్, మే 9: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో హుస్నాబాద్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. కళాశాలకు చెందిన గుంటిపల్లి అశ్విత ఎంపీసీ రెండో సంవత్సరం పరీక్షలో 1000/ 986 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. బైపీసీ విభాగంలో ఎన్. స్నిగ్ధ 1000/970 మార్కులు, సీఈసీలో ఎండీ ఏసియానౌషిన్ 1000/952 మార్కులు, హెచ్ఈసీలో జె.సింధూజ 1000/724 మార్కులు సాధించారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో వి. కావ్య ఎంపీసీలో 470/440 మార్కులు సాధించగా బైపీసీలో నందినిప్రియా 440/419 మార్కులు, సీఈసీలో లహరిక 500/ 369 మార్కులు, హెచ్ఈసీలో డి.హరిప్రియ 500/417 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ నల్లా రాంచంద్రారెడ్డి తెలిపారు.
రెండో సంవత్సరం పరీక్షకు 104మంది హాజరు కాగా ఇందులో 85 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, 81.1శాతం ఉత్తీర్ణత సాధించామని చెప్పారు. మొదటి సంవత్సరం పరీక్షకు 83మంది హాజరు కాగా 46మంది ఉత్తీర్ణులయ్యారని, 55శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మంగళవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.