సగటు ఉద్యోగికి కేంద్ర బడ్జెట్ నిరాశే మిగిల్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం ఏడేండ్లుగా ఎదురు చూస్తున్నా, మొండి చెయ్యే చూపించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కనికరం చూపలేదు. ఉద్యోగులకు ఊరటనిచ్చే విధంగా బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో 20వేల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనాల్లో 10 నుంచి 20శాతం మేరకు పన్ను చెల్లించాల్సి వస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 6వేల మంది ఉండగా, ఉపాధ్యాయులు 12వేల మంది వరకు ఉన్నారు. అలాగే పోస్టాఫీసు, ఇన్కమ్ట్యాక్స్ ఇతర కేంద్ర సంస్థల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2వేల మంది ఉంటారు. వీరంతా ఏండ్లుగా ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఎదురుచూస్తున్నారు. మంగళవారం నాటి బడ్జెట్లో మినహాయింపులు ప్రకటిస్తారని ఆశపడ్డ ఉద్యోగులు భంగపాటుకు గురయ్యారు. కేంద్రం తీరుపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు సైతం మండిపడుతున్నారు.
సంగారెడ్డి, ఫిబ్రవరి 2, (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులనే కాదు ఉద్యోగులను పట్టించుకోవటంలేదు. మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రంలోని బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్తో అన్ని వర్గాల వారిని నిరాశపర్చింది. ముఖ్యంగా సామాన్యులకు బడ్జెట్లో ఎలాంటి భరోసా కల్పించలేదు. వేతనజీవులకు కూడా బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించిందని చెప్పవచ్చు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం ఏడేండ్లుగా ఎదురుచూస్తున్నా కనికరం చూపలేదు. ఉద్యోగులకు ఊరటనిచ్చే విధంగా బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో బీజేపీ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు సైతం కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు ఎక్కువ. 2021లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు 30 శాతం మేర పెంచింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగాయి. అయితే, కేంద్రం ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకటించకపోవటంతో ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 20 శాతం మేరకు వేతనం ఆదాయపు పన్ను చెల్లించేందుకు వెళ్తుంది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం వరుసగా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతోంది. ఫలితంగా నిత్యావసర ధరలు పెరిగి ఉద్యోగుల వేతనాల్లో ఎక్కువ శాతం నిత్యావసర వస్తువుల ఖర్చుకే సరిపోతోంది. ఉద్యోగులు తప్పనిసరిగా వాహనాలు వాడుతుంటారు. దీంతో డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావం ఉద్యోగులపై పడుతున్నది. రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ ప్రభుత్వం పన్నులు మినహాయింపు ప్రకటించకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఫలితంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 20 వేల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 6వేల మంది ఉండగా ఉపాధ్యాయులు 12వేల మంది వరకు ఉన్నారు. అలాగే పోస్టాఫీసు, ఇన్కంట్యాక్స్ ఇతర కేంద్ర సంస్థ ల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2వేల మంది ఉంటారు. వీరంతా ఏడేండ్లుగా ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో మినహాయింపులు ప్రకటిస్తారని ఆశపడిన ఉద్యోగులు భంగపాటుకు గురికావాల్సి వచ్చింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 20వేల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సగానికిపైగా ఆదాయపు పన్ను చెల్లించే ఉద్యోగులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేర్వేరు స్ల్లాబుల ద్వారా పన్నులు వసూలు చేస్తోంది. ఉద్యోగులు ఏడాది వేతనం రూ.2.5 లక్షల లోపు ఉంటే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏడాది వేతనం మొత్తం 5 లక్షలు దాటిన పక్షంలో ఉద్యోగులు రూ.12.500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది వేతనం మొత్తం 7.50 లక్షల నుంచి 10 లక్షల స్ల్లాబులో ఉంటే రూ.37,500 పన్ను రూపంలో చెల్లించాలి. వేతనం మొత్తం రూ.10 నుంచి రూ.12.50 లక్షల స్లాబులో ఉంటే రూ.75,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది వేతనం రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంటే రూ.1,25,00, ఏడాది వేతనం రూ.15 లక్షల పైన ఉంటే రూ.1,87,500 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏడాది వేతనం రూ.5 లక్షలకుపైగానే ఉంటుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఏడాది సుమారు రూ.30వేల నుంచి లక్ష వరకు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. జిల్లాలో 20వేల మంది ఉద్యోగులు ఉండగా ఇందులో సగం మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచడం మూలంగా ఆదాయపు పన్ను చెల్లించే జాబితాలోకి ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో వచ్చి చేరారు.ఇదిలా ఉంటే కేంద్రంలోని పోస్టాఫీసు, ఇన్కంట్యాక్స్, రక్షణశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం తమ వేతనాల్లో 10 నుంచి 20 శాతం ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. ఉద్యోగులు చాలా కాలంగా అదాయపు పన్న మినహాయింపులు కోరుతూ వస్తున్నారు. ఆదాయపు పన్న మినహాయింపు స్లాబ్ రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.ఉద్యోగుల వేతనంలో స్టాండర్ డిడక్షన్ ప్రస్తుతం రూ.50వేలు ఉంది. దీనిని రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 80 సీ ద్వారా కేంద్రం పన్ను మినహాయింపులు ఇస్తోంది. అయితే దీని పరిమితిని మరింత పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్లు తగ్గిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఆదాయపు పన్న మినహాయింపులు ప్రకటించడం లేదు. ఇదిలా ఉంటే కేంద్రం తీరుపై ఎల్ఐసీ ఉద్యోగులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. రూ.20 లక్షల కోట్ల విలువ చేసే ఎల్ఐసీని ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎల్ఐసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు బీమా సౌకర్యాన్ని అందుబాటులో తీసుకువచ్చే ఎల్ఐసీని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నంపై ప్రజలు, ఉద్యోగులు మండిపడుతున్నారు.
నారాయణఖేడ్, ఫిబ్రవరి 2: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ను నిరసిస్తూ బుధవారం నారాయణఖేడ్లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు చిరంజీవి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో రైతాంగానికి మేలు చేసే చర్యలు చేపట్టలేదన్నారు. ఉన్నత వర్గాలు ఉపయోగించే బంగారం, వజ్రాల ఆభరణాలపై సుంకం తగ్గించి, పేదలు వినియోగించే రోల్డ్గోల్డ్పై ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు. కార్పొరేట్ శక్తులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బడ్జెట్ వల్ల పేదలకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఏరియా కమిటీ సభ్యుడు కొటారి నర్సింహులు, నాయకులు లక్ష్మణ్, మోష ప్ప, సంగయ్య పాల్గొన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు ఐటీ స్లాబులు, స్టాండర్డ్ డిడక్షన్ (ఎస్డీ) మార్చలేదు. అదే రూ.50 వేలు ఉన్నది. ఏపీజీఎల్సీ, ఎల్ఐసీ తదితర పరిమితుల మొత్తం రూ.లక్షన్నరగానే కొనసాగుతున్నది. గత ఏడేండ్లుగా ఐటీ పరిమితులు పెంచకపోవడం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేతనం పెంచినా అధిక మొత్తంలో ఐటీకే చెల్లించాల్సి వస్తున్నది. నెల వేతనం ఆదాయ పన్ను కిందనే చెల్లించాల్సి రావడం దురదృష్టకరం. – సయ్యద్ సాబేర్ అలీ, ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు